2018లో ముంబై ప్లేఆఫ్ చేరకుండా అప్పట్లో ఢిల్లీ క్యాపిటల్స్ అడ్డుకోగా.. దానికి ప్రతీకారం తీర్చుకునేలా ప్రస్తుత సీజన్లో ఢిల్లీ ప్లేఆఫ్ చేరకుండా ముంబై అద్భుత విజయాన్ని సాధించింది. తద్వారా ఢిల్లీ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఆర్సీబీ సగర్వంగా ప్లేఆఫ్ చేరుకుంది. ఇక ఈ మ్యాచ్లో ముంబై విజయతీరాలకు చేరుకుంటున్న టైంలో ఆర్సీబీ, ఆర్సీబీ, ఆర్సీబీ అంటూ స్టేడియం దద్దరిల్లింది. కాసేపు కోహ్లీ కోహ్లీ అంటూ అభిమానులు హోరెత్తించారు. ముంబై గెలుపు వల్ల ఆర్సీబీ ప్లేఆఫ్ చేరడంతో ఆర్సీబీ అభిమానులు ముంబైని తెగ పొగిడేస్తున్నారు. ఇక ఈ మ్యాచ్లో ఢిల్లీ విధించిన 160పరుగుల టార్గెట్ను ఛేదించడంలో ముంబై బ్యాటర్లు దూకుడు ప్రదర్శించారు. తొలుత ఇషాన్ కిషన్ (48పరుగులు 35బంతుల్లో 3ఫోర్లు, 4సిక్సర్లు) చెలరేగగా.. డెవాల్డ్ బ్రెవిస్ (37పరుగులు 33బంతుల్లో 1ఫోర్ 3సిక్సర్లు), తిలక్ వర్మ (21పరుగులు 17బంతుల్లో 1ఫోర్, 1సిక్సర్), టిమ్ డేవిడ్ (34పరుగులు 11బంతుల్లో 2ఫోర్లు, 4సిక్సర్లు) వీరవిహారం చేసి ముంబైకి 5వికెట్ల తేడాతో మరుపురాని విజయాన్ని అందించారు. ఢిల్లీ బౌలర్లలో నార్జ్ 2, శార్దూల్ ఠాకూర్ 2, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు.
ఆదిలో కాస్త తడబడ్డా..
ఇక ఛేదనలో భాగంగా బరిలోకి దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. రోహిత్ పూర్తిగా తడబడ్డాడు. మరో వైపు 2వ ఓవర్లో ఇషాన్ కిషన్ నార్జే బౌలింగ్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టి హిట్టింగ్ ప్రారంభించాడు. మరోవైపు రోహిత్ పూర్తిగా తడబడుతూ 10బంతుల వరకు స్కోరు చేయలేకపోయాడు. ఈ క్రమంలో 6వ ఓవర్లో రోహిత్ (13బంతుల్లో 2పరుగులు) ఔటయ్యాడు. ఇక రోహిత్ ఔటయినప్పటికీ, డెవాల్డ్ బ్రెవిస్తో కలిసి ఇషాన్ కిషన్ కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో వీరిద్దరు సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డారు. ఇక 10వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్లో బ్రెవిస్ సిక్స్, ఫోర్ బాదగా ఇషాన్ సిక్స్ సిక్స్ బాదడంతో ఆ ఓవర్లో 18పరుగులు వచ్చాయి. ఈ జంట ప్రమాదకరంగా మారుతున్న తరుణంలో 12వ ఓవర్లో కుల్దీప్ యాదవ్ ఈ జోడీని విడదీశాడు. ఇషాన్ కిషన్ను క్యాచ్ ఔట్ చేశాడు.
అరివీర భీకరంగా ఆడిన టిమ్ డేవిడ్
అప్పటికే ప్రమాదకరంగా మారిన బ్రెవిస్ ఇచ్చిన క్యాచ్ను రిషబ్ పంత్ వదిలేయడంతో అతను మరికొన్ని షాట్లు ఆడాడు. ఈ క్రమంలో శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో బ్రెవిస్ బౌల్డ్ అయ్యాడు. అయినప్పటికీ ఢిల్లీకి అంత మేలేం జరగలేదు. ఇక భీకర బ్యాటర్ టిమ్ డేవిడ్, తిలక్ వర్మతో కలిసి ఇన్నింగ్స్ను ధాటిగా నడిపించాడు. 15వ ఓవర్ చివరి బంతికి సిక్సర్తో తన దాడి ప్రారంభించిన డేవిడ్.. ఖలీల్ అహ్మద్ వేసిన 17వ ఓవర్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్, శార్దుల్ వేసిన 18వ ఓవర్లో రెండు సిక్సులు కొట్టి మ్యాచ్ ను మొత్తం ముంబై వైపు తిప్పేశాడు. ఈక్రమంలో ఆర్సీబీ ఆర్సీబీ ఆర్సీబీ అంటూ స్టేడియంలో అభిమానులు హోరెత్తించారు. ఇక టిమ్ డేవిడ్ ఔటయినప్పటికీ ముంబై చివరి రెండు ఓవర్లో 14పరుగులు మాత్రమే చేయాల్సి వచ్చింది.
తల పట్టుకున్న ఢిల్లీ ప్లేయర్లు, రికీ పాంటింగ్
ఇక 19వ ఓవర్లో 9పరుగులు రావడంతో పాటు తిలక్ వర్మ ఔటయ్యాడు. దీంతో చివరి ఓవర్లో సమీకరణం ఒక్క ఓవర్లో 5పరుగులు చేయాల్సి వచ్చింది. అయితే చివరి ఓవర్లో ఢిల్లీ బౌలర్ ఖలీల్ అహ్మద్ తొలి బంతికి నోబాల్ ఫుల్ టాస్ వేశాడు. ఫ్రీ హిట్ రాగా.. ఆ బంతికి రమన్ దీప్ సింగ్ ఫోర్ కొట్టి గెలిచింది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్లేఆఫ్స్ నుంచి నిష్క్రమించింది. ఆర్సీబీ ప్లేఆఫ్ చేరుకుంది. దీంతో ఢిల్లీ ప్లేయర్లు, కోచ్ రికీ పాంటింగ్ సైతం తల పట్టుకున్నారు. పాపం ఒక్క సీజన్ ట్రోఫీ అయినా గెలవాలనుకున్న ఆ జట్టు ఆశలు ఈ మ్యాచ్తో ఆవిరయ్యాయి.
అంతకుముందు రాణించిన పంత్, రోవ్ మెన్ పావెల్
ఇక ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బ్యాటింగ్కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20ఓవర్లలో 7వికెట్లు కోల్పోయి 159పరుగులు చేసింది. ఢిల్లీ బ్యాటర్లలో కెప్టెన్ రిషబ్ పంత్ (39పరుగులు 33బంతుల్లో 4ఫోర్లు 1సిక్సర్), రోవ్ మెన్ పావెల్ (43పరుగులు 34బంతుల్లో 1ఫోర్ 4సిక్సర్లు) రాణించారు. ఇక ముంబై బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 3వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్ పతనాన్ని శాసించాడు. బుమ్రా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుగా నిలిచాడు. ఇక డానియల్ సామ్స్, మయాంక్ మార్కండే, తలా ఒక వికెట్ తీయగా.. రమన్ దీప్ సింగ్ 2వికెట్లు తీశాడు.