హైదరాబాద్: పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా ఇమ్రాన్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేసిన వేళ.. భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అతడితో తన అనుబంధాన్ని గుర్తుకు తెచ్చుకున్నారు. పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ శనివారం ఆ దేశానికి 22వ ప్రధానికి ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా సన్నీ... ఇమ్రాన్ ఖాన్తో కొన్ని అనుభవాలను పంచుకున్నాడు. భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటన ముగిశాక రిటైర్ కావాలని గవాస్కర్ భావించాడట. ఇదే విషయాన్ని ఇమ్రాన్కు చెబితే అతను వద్దన్నాడని అలనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.
1986లో లండన్లోని ఇటాలియన్ రెస్టారెంట్లో భోజనం చేస్తున్న సమయంలో తమ మధ్య ఈ ప్రస్తావన వచ్చిందని గవాస్కర్ తెలిపారు. "అది 1986. లండన్లోని ఓ రెస్టారెంట్లో ఇద్దరం కలిసి భోజనం చేస్తున్నాం. ఆ సమయంలో నా రిటైర్మెంట్ గురించి ప్రస్తావన వచ్చింది. ఇంగ్లాండ్లో పర్యటన ముగియగానే రిటైర్మెంట్ ప్రకటిద్దాం అనుకుంటున్నట్లు ఇమ్రాన్కు చెప్పాను. అతడేమో.. ఇప్పుడే వద్దు. వచ్చే ఏడాది భారత్లో పాక్ పర్యటించనుంది. సొంతగడ్డపై భారత్ను ఓడించాలని అనుకుంటున్నాను. నువ్వు టీమిండియాలో ఉండకపోతే అంత మజా ఉండదు. చివరిసారి ఇద్దరం ఒకరితో ఒకరం పోటీ పడదాం" అని గవాస్కర్కు ఇమ్రాన్ ఛాలెంజ్ విసిరాఢు.
"ఇంగ్లాండ్తో చివరి టెస్టు ప్రారంభానికి ముందు భారత్-పాక్ షెడ్యూల్ ప్రకటన రాకపోతే రిటైర్మెంట్ చెప్పేస్తానని అన్నాను. ఆ టెస్టు ప్రారంభానికి ముందే భారత్లో పాక్ పర్యటన ఖరారైంది. దీంతో నేను నా రిటైర్మెంట్ ఆలోచనను విరమించుకున్నాను" అని గావస్కర్ తెలిపాడు. భారత్తో పాక్ ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్ ఆడింది. మొదటి నాలుగు టెస్టులు డ్రాగా ముగిశాయి. బెంగళూరులో జరిగిన చివరి టెస్టులో పాక్ 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్లో పాక్ సిరీస్ నెగ్గడం అదే తొలిసారి.
పాకిస్థాన్తో సిరీస్ అనంతరం కూడా తాను రిటైర్మెంట్ ప్రకటించలేదని గవాస్కర్ తెలిపాడు. "కొద్ది రోజుల తర్వాత లార్డ్స్లో మర్లీబోన్ క్రికెట్ క్లబ్తో జరిగిన ఆ మ్యాచ్లో వరల్డ్ ఎలెవన్ తరఫున నేను, ఇమ్రాన్ఖాన్, కపిల్ దేవ్, దిలీప్ వెంగ్సర్కార్, జావెద్ మియాందాద్ ఒకే జట్టులో ఉండి టెస్టు మ్యాచ్ ఆడాం. ఇమ్రాన్-నేను కలిసి ఓ వికెట్కు 182 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాం. ఇద్దరం కలిసి మైదానంలో ఆడే సమయంలో చాలా జోకులు వేసుకున్నాం" అని గవాస్కర్ అన్నాడు.
1971 నుంచి తనకు మేం ఒకరికొకరం తెలుసని గవాస్కర్ తెలిపారు. సామాన్యుడిగా భారత్లో ఎక్కువసార్లు పర్యటించిన పాక్ ప్రధాని ఇమ్రానే అవుతారు. ఆయన భారత్లోని సంపన్నులతోనే కాదు, సామాన్యులైన ఫ్యాన్స్తోనూ అనుబంధం ఉంది. కాబట్టి ఇరు దేశాల మధ్య సంబంధాలను ఇమ్రాన్ పునరుద్ధరిస్తారని గవాస్కర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను వెళ్లడం లేదని చెప్పిన గవాస్కర్.. తన మిత్రుడికి మాత్రం శుభాకాంక్షలు తెలిపారు.