కివీస్తో జరుగుతున్న మూడో వన్డేలో భారత జట్టు ఓటమి దిశగా సాగుతోంది. న్యూజిల్యాండ్ బౌలర్లు చెలరేగిన పిచ్పై భారత బౌలర్లు సత్తా చూపించలేకపోతున్నారు. అంతకుముందు బ్యాటర్లు విఫలమవడంతో భారత జట్టు 219 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో 220 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన కివీస్కు అదిరిపోయే ఆరంభం లభించింది.
యువ ఓపెనర్ ఫిన్ అలెన్ (57), డెవాన్ కాన్వే (38 నాటౌట్) ఆ జట్టుకు శుభారంభం అందించారు. వీళ్లిద్దరూ కలిసి తొలి వికెట్కు 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. వీళ్లిద్దరే మ్యాచ్ ముగించేస్తారా? అనుకుంటున్న తరుణంలో జమ్మూ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ మరోసారి తను ఎంత ఇంపార్టెంటో గుర్తుచేశాడు. ఫిన్ అలెన్ను పెవిలియన్ చేర్చాడు.
అయితే ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన కివీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడాడు. దీంతో 18 ఓవర్లు ముగిసే సరికి న్యూజిల్యాండ్ జట్టు ఒక వికెట్ నష్టానికి 104 పరుగులతో నిలిచింది. ఆ సమయంలో వర్షం పడటంతో ఆట ఆగింది. వర్షం ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. దీంతో డీఎల్ఎస్ విధానం ప్రకారం న్యూజిల్యాండ్ లక్ష్యం ఎంత అని అభిమానులు అంచనాలు కడుతున్నారు.
ఒకవేళ వర్షం ఆగకుండా పడి మ్యాచ్ రద్దయితే మాత్రం న్యూజిల్యాండ్ జట్టు విజయం సాధిస్తుంది. ఎందుకంటే డీఎల్ఎస్ విధానంలో చూసుకుంటే న్యూజిల్యాండ్ జట్టు.. విజయానికి అవసరమైన దాని కన్నా 50 పరుగులు అదనంగా చేసింది. అంటే ఒకవేళ మ్యాచ్ రద్దయితే ఈ వన్డే సిరీస్ను న్యూజిల్యాండ్ 2-0 తేడాతో తన ఖాతాలో వేసుకుంటుందన్నమాట.
ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ జట్టు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయింది. కివీస్ బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటర్లంతా చేతులెత్తేశారు. ఆరంభంలోనే శిఖర్ ధావన్ (28), శుభ్మన్ గిల్ (13), సూర్యకుమార్ యాదవ్ (6), రిషభ్ పంత్ (10) ఈ మ్యాచ్లో పూర్తిగా విఫలమయ్యారు.
ఇలాంటి సమయంలో శ్రేయాస్ అయ్యర్ (49) మరోసారి తన విలువను నిరూపించుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన దీపక్ హుడా (12), దీపక్ చాహర్ (12) ఏమాత్రం ప్రభావం చూపలేదు. అయితే వాషింగ్టన్ సుందర్ (51) ఒంటరి పోరాటంతో జట్టు స్కోరును 200 దాటించాడు. అతనికి యుజ్వేంద్ర చాహల్ (8), అర్షదీప్ సింగ్ (9) మంచి సహకారం అందించారు.