న్యూజిలాండ్ ప్రదర్శనకు అభిమానులు ఫిదా
ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ చేసిన ప్రదర్శనకు మాజీ ఆటగాళ్లతో పాటు క్రికెట్ అభిమానులు సైతం ఫిదా అయ్యారు. చివరివరకు ఉత్కంఠగా సాగినా ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ ఫీల్డర్లు మైదానంలో ఎన్ని తప్పులు చేసినా... న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ మాత్రం ఎప్పుడూ నవ్వుతూ చాలా కూల్గా కనిపించాడు. మ్యాచ్ ముగిశాక జరిగిన ప్రజెంటేషన్ కార్యక్రమంలో సైతం కేన్ విలియమ్సన్ కూల్గానే ఉన్నాడు.
ఐసీసీ నిబంధనల వల్లే కివీస్ ఓటమి
విలియమ్సన్ ప్రవర్తనను చూసిన క్రికెట్ అభిమానులను అతడిని మరో కెప్టెన్ కూల్ అని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి ఫైనల్ మ్యాచ్కి గనుక పాత ఐసీసీ నిబంధనలు వర్తించి ఉంటే ఇంగ్లాండ్-న్యూజిలాండ్లు సంయుక్త విజేతలుగా నిలిచేవి. అయితే, మార్చిన నిబంధనల ప్రకారం సూపర్ ఓవర్లో కూడా స్కోర్లు సమం అయితే, అత్యధిక బౌండరీలు బాదిన జట్టునే విజేతగా ప్రకటిస్తారు. ఈ నిబంధనతోనే ఇంగ్లాండ్ విశ్వవిజేతగా అవతరించింది.
కివీస్ ఓటమిపై సగటు క్రికెట్ అభిమాని
దీంతో ఈ మ్యాచ్లో కివీస్ ఓడిపోయిందంటే సగటు క్రికెట్ అభిమాని కూడా దానిని తమ పరాజయంగా భావిస్తున్నాడు. అంతేకాదు ఈ నిబంధనపై క్రికెట్ విశ్లేషకులతో పాటు మాజీ క్రికెటర్లు సైతం తప్పుబడుతున్నారు. ఈ మ్యాచ్లో మార్టిన్ గుప్టిల్ వేసిన ఓవర్త్రో స్టోక్స్ బ్యాట్ను తాకి 6 పరుగులు రావడం కూడా మ్యాచ్ ఫలితంపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఇదే న్యూజిలాండ్ నుంచి మ్యాచ్ను లాగేసుకుంది. అయితే ఆ జట్టు గొప్పతనాన్ని ఈ మ్యాచ్ ఫలితం తగ్గించలేదనడంలో ఎటువంటి సందేహాం లేదు.
ప్రపంచ కప్లో గొప్ప విజయాలు
ప్రత్యర్థులపై మాటల దాడి చేయకుండా, దూషణలకు పాల్పడకుండా ప్రపంచ కప్లో గొప్ప విజయాలు సాధించవచ్చని న్యూజిలాండ్ జట్టు నిరూపించింది. న్యూజిలాండ్ క్రికెట్ అనగానే సగటు అభిమానికి గుర్తుకు వచ్చేది మైదానంలో వారి ప్రవర్తన. తమదైన శైలిలో ఆడుకుంటూ గెలుపోటములతో నిమిత్తం లేకుండా క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తారు. ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునేందుకు 2016లో ఐసీసీ డీమెరిట్ పాయింట్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది. అప్పటినుంచి ఇప్పటి వరకు మిగతా జట్లతో పోలిస్తే తక్కువ సార్లు శిక్షకు గురైన జట్టు ఏదైనా ఉందంటే అది న్యూజిలాండ్ జట్టు మాత్రమే.
విలియమ్సన్కు సరైన మద్దతు లభించలేదు
నిజానికి ఈ ప్రపంచకప్లో కెప్టెన్ కేన్ విలియమ్సన్కు జట్టులోని మిగతా ఆటగాళ్ల నుంచి సరైన మద్దతు లభించలేదు. అయితే, కివీస్ అభిమానులకు ఊరటనిచ్చే విషయం ఏంటంటే కేన్ విలియమ్సన్కు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించడం. ఈ ప్రపంచకప్లో కేన్ విలియమ్సన్ 82.57 యావరేజితో 578 పరుగులు చేశాడు. అంతేకాదు ఒక ప్రపంచకప్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్గా జయవర్దనే రికార్డుని కూడా బద్దలు కొట్టాడు. మరోవైపు న్యూజిలాండ్ జట్టుకు చెందిన వెటరన్ క్రికెటర్ రాస్ టేలర్ మూడు హాప్ సెంచరీలతో 350 పరుగులకే పరిమితమయ్యాడు.
ఓడినా హృదయాలను గెలుచుకున్న న్యూజిలాండ్
గత ప్రపంచకప్లో డబుల్ సెంచరీ చేసిన మార్టిన్ గప్టిల్ ఈ ప్రపంచకప్లో ఘోరంగా విఫలమయ్యాడు. 10 ఇన్నింగ్స్లలో కలిపి మొత్తం అతడు 186 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఇక, న్యూజిలాండ్ ఇక్కడి వరకు రాగలిగిందంటే అందుకు ఆ జట్టు బౌలర్లే కారణం. లూకీ ఫెర్గూసన్ (21), ట్రెంట్ బౌల్ట్ (17), మ్యాట్ హెన్రీ (14)లు ముగ్గురూ కలిపి ఈ ప్రపంచకప్లో 52 వికెట్లు పడగొట్టి కివీస్ విజయాల్లో కీలకపాత్ర పోషించారు. ఈ ప్రపంచకప్లో ఆప్ఘనిస్థాన్తో మినహా 300 దాటని ఏకైక జట్టు ఏదైనా ఉందంటే అది న్యూజిలాండే. ఏది అయితేనేం ట్రోఫీ నెగ్గకపోయినప్పటికీ... కేన్ విలియమ్సన్ సేన క్రికెట్ అభిమానుల హృదయాలను మాత్రం గెలుచుకుంది.