హైదరాబాద్: ఇప్పటి వరకూ లేని శిక్షలు విధిస్తామని చెబుతోంది ఐసీసీ. బాల్ టాంపరింగ్కు పాల్పడితే క్రికెటర్లపై శిక్షలను మరింత తీవ్రతరం చేస్తామని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) నిర్ణయం తీసుకోనుంది. వెస్టిండీస్తో తాజాగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్లో శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్పై ఆదివారం ఐసీసీ బాల్ టాంపరింగ్ అభియోగాల్ని నమోదు చేసిన విషయం తెలిసిందే.
చండిమాల్ ఈ అభియోగాన్ని తిరస్కరించడంతో ఐసీసీ విచారణ ప్రారంభించింది. ఇప్పటి వరకు బాల్ టాంపరింగ్కి పాల్పడిన క్రికెటర్పై లెవల్-2 ప్రకారం ఐసీసీ ఒక టెస్టు లేదా రెండు వన్డేలు నిషేధం విధించేది. కానీ.. తాజాగా ఆ శిక్షని లెవల్-3కి మార్చి.. నాలుగు టెస్టులు లేదా ఎనిమిది వన్డేల్లో ఆ క్రికెటర్ని ఆడనివ్వకుండా చేయాలని ఐసీసీ యోచిస్తోంది. ఈ మేరకు త్వరలో జరగనున్న ఐసీసీ వార్షిక సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది.
'బాల్ టాంపరింగ్, మైదానంలో అసభ్య పదజాలం, ధూషణకి దిగే క్రికెటర్లని లెవల్-3 ప్రకారం శిక్షించాలనే అంశంపై బోర్డులో చర్చిస్తున్నాం' అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటీవ్ డేవిడ్ రిచర్డ్సన్ వెల్లడించారు.
ఈ ఏడాది ఆరంభంలో ఐపీఎల్కు ముందు దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్స్మిత్, ఓపెనర్ డేవిడ్ వార్నర్, ఫాస్ట్ బౌలర్ బెన్క్రాఫ్ట్లు బాల్ టాంపరింగ్ కారణంగా కెరీర్ని మసకబార్చుకున్నారు. అంతర్జాతీయ క్రికెట్కే కాదు ఐపీఎల్ 2018 లోనూ పాల్గొనే అవకాశాన్ని చేజార్చుకున్నారు.