U-19 వరల్డ్కప్ పైనల్: పాక్పై గెలిచిన భారత్, సచిన్ నుంచి రైనా వరకు

హైదరాబాద్: న్యూజిలాండ్ వేదికగా జరుగుతోన్న ఐసీసీ అండర్-19 వరల్డ్ కప్లో భారత్ విజయపరంపర కొనసాగుతోంది. పాకిస్థాన్తో జరిగిన రెండో సెమీఫైనల్లో భారత్ 203 పరుగుల తేడాతో భారీ విజయం సాధించి ఫైనల్స్లోకి దూసుకెళ్లింది. ఫిబ్రవరి 3న జరిగే ఫైనల్లో ఆస్ట్రేలియాతో భారత్ తలపడుతుంది. అండర్-19 వరల్డ్ కప్ టోర్నీ పైనల్స్లోకి భారత జట్టు దూసుకెళ్లడం ఇది ఆరోసారి కాగా, మూడు సార్లు టీమిండియా టైటిల్ విజేతగా నిలిచింది.
సోమవారం (జనవరి 29) ఆప్ఘనిస్థాన్తో జరిగిన తొలి సెమీ పైనల్లో ఆస్ట్రేలియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్స్కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఇక, వరల్డ్ కప్ను చెరో మూడుసార్లు గెలుచుకుని సమవుజ్జీలుగా ఉన్న భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఫైనల్ జరగనుండటంతో తుదిపోరుపై అభిమానులు ఆసక్తిని కనబరుస్తున్నారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత ఓపెనర్లు చక్కటి శుభారంభం ఇచ్చారు.
కెప్టెన్ పృథ్వీ షా, మన్జోత్ కల్రాతో కలిసి తొలి వికెట్కు 89పరుగులు జోడించారు. దూకుడుగా ఆడే క్రమంలో పృథ్వీ షా 41 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రనౌట్గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో ఓపెనర్ కల్రా హాఫ్ సెంచరీకి చేరువయ్యే క్రమంలో 47 పరుగుల వద్ద పెవిలియన్కు చేరాడు. దీంతో 94 పరుగులకు టీమిండియా రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన శుభమాన్ గిల్ ఇన్నింగ్స్ మ్యాచ్కే హైలెట్గా నిలిచింది.
94 బంతుల్లో 102 పరుగులతో సెంచరీని నమోదు చేశాడు. ఇందులో 7 ఫోర్లు ఉన్నాయి. గిల్తో కలిసి ఇన్నింగ్స్ను చక్కదిద్దిన దేశాయ్ జట్టు స్కోరు 148 పరుగుల వద్ద పెవిలియన్కు చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన రాయ్ 45 బంతుల్లో 33 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాట్స్మెన్ నుంచి సరైన సహకారం లేకపోవడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది.
పాకిస్థాన్ బౌలర్లలో మహమ్మద్ ముసా నాలుగు, అర్షద్ ఇక్బాల్ మూడు వీకెట్లు తీశారు. అనంతరం 273 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్కు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. భారత బౌలర్ల ధాటికి పాక్ బ్యాట్స్మెన్ వరుసగా క్యూ కట్టారు. 10 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయిన పాక్ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేకపోయింది.
ఇషాన్ పోరెల్ ఆరు ఓవర్లకు 17పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఓపెనర్లు ఇమ్రాన్ షా(2), మహమ్మద్ జైద్(7)లతో పాటు అలీ జర్యబ్ ఆసిఫ్(1) పోరెల్ ధాటికి ఐదు ఓవర్లకే పెవిలియన్ బాట పట్టారు. మరో బౌలర్ పరాగ్ కూడా చెలరేగి రోహైల్ నజీర్(18), హసన్ ఖాన్(1)ను వెంటవెంటనే పెవిలియన్ పంపాడు. 25 ఓవర్లు ముగిసేసరికి 8 వికెట్లు కోల్పోయి 48పరుగులు మాత్రమే చేసింది.
ఆ తర్వాత షాద్ ఖాన్(15) కాసేపు నిలబడే ప్రయత్నం చేసిన వికెట్ కీపర్ దేశాయ్ అతడిని స్టంపౌంట్ చేశాడు. చివర్లో అర్షద్ ఇక్బాల్ను అభిషేక్ శర్మ ఔట్ చేయడంతో పాక్ 69 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో శివసింగ్, రియాన్ పరాగ్ తలో రెండేసి వికెట్లు తీశారు. పాకిస్తాన్పై ఘన విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లిన టీమిండియాపై సోషల్ మీడియాలో అభినందనల వర్షం కురుస్తోంది.
సచిన్ టెండూల్కర్
పాక్ను చిత్తుగా ఓడించి అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్స్కు చేరుకున్న భారత జట్టుపై క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు.
మహమ్మద్ కైఫ్
సెమీ ఫైనల్స్ భారత్ అద్భుత విజయం సాధించింది. ఎంతో గర్వంగా ఉంది. ఆరోసారి పైనల్స్కు చేరిన టీమిండియాకు అభినందనలు.
బీసీసీఐ
అద్భుతమైన ప్రదర్శన. వరల్డ్ కప్కు టీమిండియా అడుగు దూరంలో నిలిచింది.
హర్భజన్ సింగ్
అండర్-19 వరల్డ్ కప్ సెమీ పైనల్లో శుభమాన్ గిల్ అద్భుతమైన ఇన్నింగ్స్. గర్వంగా ఉంది.
వీవీఎస్ లక్ష్మణ్
అండర్-19 వరల్డ్ కప్లో కుర్రాళ్లు అద్భుత ప్రదర్శన చేశారు. పైనల్స్కు బెస్ట్ విషెస్.
వీరేంద్ర సెహ్వాగ్
పాకిస్థాన్పై అద్భుత విజయాన్ని నమోదు చేశారు. ఫైనల్స్కు బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నా.
సురేశ్ రైనా
టోర్నీలో అద్భుత ప్రదర్శన కనబర్చారు. కంగ్రాట్స్ టీమిండియా. టైటిల్కు అడుగు దూరంలో నిలిచారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications