టాప్లోనే భారత్:
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గత ఏడాది ఆగస్టులో ఐసీసీ టెస్టు ఛాంపియన్షిప్ని ప్రారంభించింది. అప్పటి నుంచి ఆడిన ఏడు టెస్టుల్లోనూ భారత్ జయకేతనం ఎగురవేసింది. అయితే తాజా కివీస్ పర్యటనలోని రెండు టెస్టుల్లో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. అయినా కూడా పాయింట్ల పట్టికలో భారత్ తన నెం.1 స్థానాన్ని కాపాడుకుంది. ప్రస్తుతం 360 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతోంది.
మూడో స్థానానికి కివీస్:
296 పాయింట్లతో రెండో స్థానంలో ఆస్ట్రేలియా ఉంది. అయితే ఆస్ట్రేలియాకు భారత్కు మధ్య 64 పాయింట్ల భారీ తేడా ఉండటం విశేషం. న్యూజిలాండ్ రెండు టెస్టులను గెలుపొందడంతో.. ఏకంగా 120 పాయింట్లను ఖాతాలో వేసుకుంది. దీంతో 180 పాయింట్లతో ఇంగ్లాండ్ను వెనక్కినెట్టి మూడో స్థానాన్ని ఆక్రమించింది. ప్రస్తుతం ఇంగ్లాండ్ ఖాతాలో146 పాయింట్లు ఉన్నాయి. పాకిస్థాన్ (140), శ్రీలంక (80), దక్షిణాఫ్రికా (24)లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వెస్టిండీస్, బంగ్లాదేశ్ ఇంకా ఖాతా తెరవలేదు.
ఈ ఏడాది చివరిలో ఆసీస్తో సిరీస్:
భారత్ ఈమధ్య కాలంలో టెస్ట్ సిరీస్ ఆడదు. ఈనెల 12 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్ ఆడుతుంది. అనంతరం ఐపీఎల్, ఆసియా కప్, టీ20 ప్రపంచకప్ వరకూ టీమిండియా వైట్బాల్ క్రికెట్నే ఆడుతుంది. ఇక ఈ ఏడాది చివరిలో ఆసీస్తో నాలుగు టెస్టుల సిరీస్, ఇంగ్లాండ్తో సొంతగడ్డపై ఐదు టెస్టుల సిరీస్ ఆడనుంది.
2021లో ఫైనల్:
2019 ఆగస్టు 1 నుంచి టెస్టు ఛాంపియన్షిప్ ప్రారంభమయింది. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు ఛాంపియన్షిప్లో పోటీపడుతున్నాయి. ప్రతి జట్టూ సొంతగడ్డపై మూడు టెస్టు సిరీస్లు, విదేశీ గడ్డపై మూడు సిరీస్లు ఆడనుంది. 27 సిరీస్ల్లో 71 టెస్టులు జరగనున్నాయి. అన్ని టెస్టుల అనంతరం టాప్-2లో నిలిచిన జట్ల మధ్య 2021 జూన్ నెలలో ఫైనల్ జరగనుంది.