టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్, స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ ప్రశంసల వర్షం కురిపించారు. మైదానంలో ధోనీ కంప్యూటర్ కన్నా వేగంగా స్పందిస్తాడు అని అక్తర్ పేర్కొన్నాడు. కేఎల్ రాహుల్ను కూడా షోయబ్ మెచ్చుకున్నాడు. తాజాగా అక్తర్ తన యూట్యూబ్ చానెల్ ద్వారా మాట్లాడాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
షోయబ్ అక్తర్ మాట్లాడుతూ... ' మైదానంలో ధోనీ చతురత కంప్యూటర్ కంటే వేగంగా ఉంటుంది. ఏ వికెట్ ఎలా స్పందిస్తుందనే విషయంలో ధోనీ కంప్యూటర్ కన్నా వేగంగా స్పందిస్తాడు. మైదానంలో సహచర ఆటగాళ్లకు నిర్దేశం చేస్తూ.. జట్టు విజయానికి ప్రణాళికలు రచించే ధోనీ టీమిండియాకు ఉండడం కలిసొస్తుంది. అతను కచ్చితంగా ఈ ప్రపంచకప్లో తన మార్క్ చూపిస్తాడు' అని అక్తర్ అన్నారు.
'క్రికెటర్గా కేఎల్ రాహుల్ అంటే ఇష్టం. అతను టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ అడుగు జాడల్లో నడుస్తాడనిపిస్తోంది. భవిష్యత్లో అతనో గొప్ప బ్యాట్స్మన్ అవుతాడు. గతంలో అతన్ని ఓసారి కలిసాను. మైదానం, బయట ఇతర వ్యాపకాలపై దృష్టి పెట్టకుండా.. ఆటపైనే ఫోకస్ పెట్టాలని సూచించాను. రాహుల్కు మంచి భవిష్యత్ ఉంది. ప్రపంచకప్లో రాణిస్తాడు' అని అక్తర్ పేర్కొన్నారు.
ప్రపంచకప్లో భాగంగా దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన తొలి మ్యాచ్లో టీమిండియా విజయం సాధించింది. దీంతో ప్రపంచకప్ను టీమిండియా ఘనంగా ఆరంబించింది. టీమిండియా తన తరువాతి మ్యాచ్లో ఆదివారం ఆస్ట్రేలియాతో తలపడునుంది. ఇక జూన్ 16న పాకిస్తాన్తో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్ కోసం పాక్-భారత్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.