ప్రాక్టీస్ చేస్తుండగా గాయం:
శనివారం సౌథాంప్టన్లోని రోజ్బౌల్ స్టేడియంలో ఆఫ్ఘనిస్తాన్తో టీమిండియా మ్యాచ్ ఆడనుంది. దీనికోసం రోజ్బౌల్ స్టేడియంలో భారత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. నెట్ ప్రాక్టీస్ చేస్తోన్న సందర్భంగా టీమిండియా పేస్ బౌలర్ బుమ్రా వేసిన ఓ యార్కర్ నేరుగా విజయ్ శంకర్ పాదాలను బలంగా తాకింది. వెంటనే ఫిజియే ప్రథమ చికిత్స అందించాక మైదానాన్ని వీడాడు. బంతి తీవ్రతకు మడమల్లో వాపు కనిపించిందని జట్టు ఫిజియోథెరఫిస్ట్ తెలిపారు.
ఆందోళన అక్కర్లేదు:
శంకర్ గాయంపై బుమ్రా స్పందించాడు. 'ఏ బౌలర్ కూడా బ్యాట్స్మన్కు గాయం కావాలని కోరుకోడు. నెట్స్లో ప్రాక్టీస్ చేస్తుంటే బ్యాట్స్మన్కు బౌలింగ్కు చేయాలనుకుంటాం. కొన్ని సందర్భాల్లో గాయాలు అవుతాయి. ఎవరూ ఆ బంతికి గాయం అవుతుందని ముందే అంచనా వేయలేరు. నా బౌలింగ్లో శంకర్కు అనుకోకుండా గాయం అయింది. అతని గాయం గురించి ఆందోళన అనవసరం. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడు' అని బుమ్రా తెలిపారు. ఆఫ్ఘనిస్తాన్తో మ్యాచ్ ఆడటానికి ఇంకా సమయం ఉన్నందున ఈ లోగా కోలుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
తొలి బంతికే వికెట్:
ప్రపంచకప్లో తొలి బంతికే వికెట్ను తీసుకున్న బౌలర్గా శంకర్ రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ నెల 16వ తేదీన మాంఛెస్టర్లోని ఓల్డ్ ట్రాఫొర్డ్ మైదానంలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో అతను ఈ ఫీట్ను సాధించాడు. తొడ కండరాలు పట్టేయడంతో ఓ ఓవర్లో నాలుగు బంతులేసిన భువనేశ్వర్ కుమార్.. బౌలింగ్ నుంచి అర్ధాంతరంగా వైదొలిగాడు. ఆ రెండు బంతులను వేయడానికి వచ్చిన శంకర్ తొలి బంతికే పాకిస్తాన్ ఓపెనర్ ఇనాముల్ హక్ వికెట్ను తీసాడు.
భువీ కోలుకునేనా:
మరోవైపు భువనేశ్వర్ పూర్తి స్థాయిలో కోలుకుంటాడా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంగ్లండ్తో ఈనెల 30న జరిగే మ్యాచ్ వరకు భువీ ఫిట్నెస్ సాధిస్తాడా అన్నది అనుమానంగా మారింది. గాయం తీవ్రత అధికంగా ఉంటే.. భువీని తప్పించే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం తెలుస్తోంది. భువీ దూరమైతే స్టాండ్బైగా ఎంపికైన పేసర్ ఇషాంత్ శర్మ ఇంగ్లండ్ రానున్నాడు.