
హైదరాబాద్: కార్డిఫ్ వేదికగా బంగ్లాదేశ్తో జరుగుతున్న మ్యాచ్లో ఇంగ్లాండ్ ఓపెనర్ జేసన్ రాయ్ సెంచరీ సాధించాడు. ముస్తాఫిజుర్ వేసిన 27వ ఓవర్లో ఫోర్ బాది సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వన్డేల్లో అతనికిది తొమ్మిదో శతకం కావడం విశేషం. కేవలం 92 బంతుల్లోనే సెంచరీని అందుకున్నాడు.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
జేసన్ రాయ్ సెంచరీని పూర్తి చేసే క్రమంలో అంపైర్ను కింద పడేయడం గమనార్హం. ముస్తాఫిజుర్ వేసిన 27 ఓవర్ ఐదో బంతిని డీప్ స్వేర్ లెగ్ వైపు ఆడాడు. అయితే, బంతి ఫీల్డర్ చేతుల్లోంచి మిస్ కావడంతో బౌండరీ లైన్ను తాకింది. ఈ క్రమంలోనే బంతిని చూస్తూ నాన్ స్టైకింగ్ ఎండ్లోకి పరుగు తీస్తున్న రాయ్ అంపైర్ జోయల్ విల్సన్ను ఢీకొట్టాడు.
అదే సమయంలో అంపైర్ కూడా బంతినే చూస్తుండటంతో అనుకోకుండా వీరిద్దరూ ఢీకొన్నారు. దీంతో అంపైర్ ఒక్కసారిగా కిందపడిపోయాడు. అంపైర్కు ఏమీ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ దృశ్యాన్ని చూసిన ఇంగ్లాండ్ క్రికెటర్లు పడి పడి నవ్వుకున్నారు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన ఇంగ్లాండ్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది.
ఐదు ఓవర్లు ముగిసేసరికి కేవలం 15 పరుగులు మాత్రమే చేసిన ఇంగ్లాండ్ ఆ తర్వాత మరింత దూకుడుగా ఆడింది. రాయ్, బెయిర్స్టోలు తొలి వికెట్కి 128 పరుగులు జోడించారు. హాఫఅ సెంచరీ అనంతరం మోర్తజా బౌలింగ్లో బెయిర్స్టో(51) ఔట్ అయ్యాడు. ప్రస్తుతం 30 ఓవర్లు ముగిసేసరికి ఇంగ్లాండ్ వికెట్ నష్టానికి 185 పరుగులు చేసింది. రాయ్(110), రూట్(20) క్రీజులో ఉన్నారు.