మైదానం నుంచి బయటకు
మ్యాచ్ జరిగే సమయంలో ఆటగాడు చెడుగా ప్రవర్తనకు పాల్పడితే లెవెల్ 4 నిబంధనను అమలు చేయనున్నారు. అంటే మైదానంలో ఒక క్రికెటర్ తో తారా స్థాయిలో వాగ్వాదం చేసినా, అంపైర్తో చెడుగా ప్రవర్తించినా అతడిని మైదానం నుంచి బయటకు పంపేస్తారు. ఈ నిబంధన పుట్బాల్లో ఎప్పటి నుంచో ఉండటంతో క్రికెట్లో కూడా అమలు చేశారు. ఇక అంతకుముందున్న ఐసీసీ లెవెల్ 1 నుంచి 3 వరకూ ఉన్న నిబంధనలు యథావిధిగా కొనసాగుతాయి.
బ్యాట్ సైజు
గత కొంతకాలంగా బ్యాట్స్మెన్లు రకరకాల సైజుల్లో బ్యాట్లు వాడటంపై విమర్శలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇక్కడ బ్యాట్ పొడవు, వెడల్పు విషయంలో ఐసీసీ ఎటువంటి నిర్ణయం తీసుకోకపోగా, తాజా నిబంధన ప్రకారం బ్యాట్ ఓవరాల్ మందం మాత్రం 67mmకు మించకూడదు. అదే సమయంలో బ్యాట్ అంచు మందం మాత్రం 40mmను దాటి ఉండకూడదనే నిబంధనను కొత్తగా ప్రవేశపెట్టింది. బ్యాట్ సైజుని పరీక్షించేందుకు గాను అంఫైర్లకు ఐసీసీ విచక్షణాధికారాలను కట్టబెట్టింది.
డీఆర్ఎస్
టెస్టుల్లో ఒక ఇన్నింగ్స్లో 80 ఓవర్ల తర్వాత అదనపు రివ్యూలు అమలు చేసే విధానానికి ఐసీసీ స్వస్తి పలికింది. కొత్త నిబంధనల ప్రకారం ఒక ఇన్నింగ్స్లో 80 ఓవర్లు ముగిసిన పక్షంలో అదనపు రివ్య్యూలు కోరే అవకాశం ఉండదు. అంతేకాదు ప్రతి ఇన్నింగ్స్లో రెండు విజయవంతం కాని రివ్యూలను ఉపయోగించుకునే వీలు కల్పించింది.
రనౌట్స్
రనౌట్ అవుట్ విషయంలో కీలక మార్పుకు ఐసీసీ శ్రీకారం చుట్టింది. ఒక బ్యాట్స్మెన్ పరుగు తీసే సమయంలో డైవ్ కొడుతూ బ్యాట్ను ముందుగా ఒకసారి గ్రౌండ్ను తాకి ఉంచి ఆ తర్వాత అదే బ్యాట్ గాలిలో ఉంచినప్పటికీ తొలుత జరిగిన చర్యనే ఇక్కడ పరిగణలోకి తీసుకుంటారు. అంటే అదే సమయంలో వికెట్ కీపర్ వికెట్లను గిరాటేసినప్పటికీ బ్యాట్స్మెన్ మందుగా క్రీజులో బ్యాట్ను ఉంచాడు కాబట్టి నాటౌట్గా ప్రకటిస్తారు. స్టంపింగ్ విషయంలో కూడా దీనినే అమలు చేయనున్నారు.
బౌండరీ క్యాచ్లు
బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న బౌలర్లు గాలిల్లోకి ఎగిరే బంతిని బౌండరీ లైన్ అవతల అందుకుని లోపలికి రావాలి. అలా కాని పక్షంలో దానిని బౌండరీగానే లెక్కించనున్నారు.
|
కొత్త నిబంధనలపై ఐసీసీ జనరల్ మేనేజర్
‘ఐసీసీ కొత్త రూల్స్పై అవగాహన కోసం ఇప్పటికే అంపైర్లకి వర్క్షాప్ నిర్వహించాం. నూతన మార్పులను అంపైర్లు చక్కగా అర్థం చేసుకున్నారు. సెప్టెంబరు 28 నుంచి అంతర్జాతీయ మ్యాచ్ల్లో వాటిని అమలు చేయనున్నాం' అని ఐసీసీ జనరల్ మేనేజర్ జియోఫ్ అల్లారిస్ వెల్లడించారు.
భారత్, ఆస్ట్రేలియా సిరిస్కు వర్తించని కొత్త రూల్స్
ప్రస్తుతం స్వదేశంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న ఐదు వన్డేలు, మూడు టీ20ల సిరీస్కి మాత్రం ఐసీసీ కొత్త నిబంధనుల వర్తించవు. ఇప్పటికే సగం సిరీస్ ముగిసినందున కొత్త రూల్స్ని ప్రవేశపెడితే గందరగోళం నెలకొంటుందని ఐసీసీ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.