పాకిస్తాన్ క్రికెట్ జట్టును గాడిలో పెడుతా అని ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. ఇటీవల ముగిసిన వన్డే ప్రపంచకప్లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు లీగ్ దశ నుంచే నిష్క్రమించిన విషయం తెలిసిందే. గ్రూప్ మొదటి దశలో నిలకడలేమి ఆటను ప్రదర్శించి నాకౌట్ అవకాశాలను దూరం చేసుకుంది. కివీస్తో సమానంగా 11 పాయింట్లు సాధించినప్పటికీ.. రన్రేట్ ఆధారంగా పాక్ టోర్నీ నుండి నిష్క్రమించింది. దీంతో పాక్ జట్టు తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది.
ప్రొ కబడ్డీ లీగ్ సీజన్-7 ప్రత్యేక వార్తల కోసం
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ఇమ్రాన్ ఖాన్ పాక్ క్రికెట్ జట్టుపై స్పందించాడు. 'నేను ఇంగ్లాండ్ వెళ్లి అక్కడ క్రికెట్ ఆడటం నేర్చుకున్నా. అక్కడ నుండి తిరిగి వచ్చినప్పుడు ఇతర ఆటగాళ్ళ ప్రమాణాలను పెంచాం. ఇక పాకిస్తాన్ క్రికెట్ జట్టును గాడిలో పెట్టాలని నిర్ణయించుకున్నా' అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.
'నా మాటలను గుర్తుంచుకోండి. వచ్చే ప్రపంచకప్లో ప్రొఫెషనల్ పాక్ జట్టును చూస్తారు. జట్టును ఆవిధంగా మారుస్తా. అత్యుత్తమ ఆటగాళ్ల ఎంపికే నా లక్ష్యం. ప్రతిభ ఉన్న ఆటగాళ్లకు అవకాశమిస్తా. జట్టులో కూడా మార్పులు చాలా అవసరం' అని ఇమ్రాన్ ఖాన్ అభిప్రాయపడ్డారు.
మరోవైపు లీగ్ దశలోనే నిష్క్రమించిన పాకిస్థాన్ జట్టు ప్రక్షాళన దిశగా ఆ దేశ క్రికెట్ బోర్డు (పీసీబీ) దృష్టి సారించింది. ఇందులో భాగంగా టెస్టు, పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు వేర్వేరు కెప్టెన్లతో పాటు కోచ్లను నియమించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఈ నెలాఖరున పాకిస్థాన్ క్రికెట్ బోర్డు సమావేశం కానుంది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ... 'టెస్టు చాంపియన్షిప్లో భాగంగా ఈ సీజన్లో శ్రీలంక, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, ఇంగ్లండ్తో పాకిస్థాన్ మ్యాచ్లు ఆడనుంది. ఈ టెస్టులన్నీ వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరిగే టీ20 వరల్డ్కప్కు ఉపయోగపడుతాయి. టెస్టు క్రికెట్లో జట్టు ప్రదర్శన మెరుగవ్వాలని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు యోచిస్తోంది. పరిమిత ఓవర్ల క్రికెట్లో సర్ఫరాజ్ సారధ్యంతో సంతృప్తిగానే ఉన్న బోర్డు.. సంప్రదాయ క్రికెట్లో మాత్రం కెప్టెన్సీ మార్చే ఉద్దేశంలో ఉన్నట్లు' ఆయన తెలిపారు.