ముంబై: టీమిండియా సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాకు వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మద్దతుగా నిలిచాడు. సాహా అత్యుత్తమ కీపర్ అని, టెస్టు క్రికెట్లో అతడిని టీమిండియా కొంతకాలం రెండో కీపర్గా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ బ్యాట్స్మన్గా, కీపర్గా ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నాడన్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టులో విఫలమైన సాహా.. ఆ తర్వాత రిజర్వ్ బెంచ్కే పరిమితమైన సంగతి తెలిసిందే. సాహా స్థానంలో చోటు దక్కించుకున్న పంత్.. అద్భుతంగా రాణించడంతో జట్టులో అతడి చోటుపై అనుమానాలు వ్యక్తమయ్యాయి.
తాజాగా ఓ క్రీడా ఛానెల్లో మాజీ బ్యాట్స్మన్ ఆకాశ్ చోప్రాతో హర్భజన్ సింగ్ మాట్లాడాడు. ఈ సందర్భంగా పంత్కు తోడుగా రెండో కీపర్గా భారత్ సాహాను కొనసాగించాలా లేక యువ వికెట్కీపర్ వైపు మొగ్గుచూపాలా? అని చోప్రా.. హర్భజన్ను అడిగాడు. 'ఇది చాలా కష్టమైన ప్రశ్న. కానీ ఎవరినైనా ఎంపిక చేసుకోవాల్సి వస్తే కచ్చితంగా సాహానే ఎంచుకుంటాను. అతడు జట్టుతో కలిసి చాలా కాలంగా ఆడుతున్నాడు. అంతేకాదు అతడో అత్యుత్తమ కీపర్ కూడా' అని హర్భజన్ సమాధానం ఇచ్చాడు.
'రిషబ్ పంత్ బ్యాట్స్మన్గా, కీపర్గా ఇప్పుడిప్పుడే మెరుగవుతున్నాడు. అతడు ఆడేకొద్దీ మరింత నైపుణ్యం సాధిస్తాడు. అయితే సాహాను కొంతకాలం జట్టుతో కొనసాగించాలి. అతడి వయసు 35 ఏళ్లు దాటిందని తెలుసు. కానీ చాలా మంది యువకుల కన్నా అతడే అత్యుత్తమం. అలాగే టీమిండియాకు కలిసి వచ్చే విషయం ఏమిటంటే.. కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్ లాంటి ఆటగాళ్లు కూడా కీపింగ్ స్థానం కోసం సిద్ధంగా ఉన్నారు' అని హర్భజన్ పేర్కొన్నాడు.
అనంతరం ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ... 'సాహా లాంటి ఉత్తమ కీపర్ ప్రపంచంలోనే ఉండడని తెలుసు. కానీ అతడిని తీసుకుంటే జట్టు కూర్పులో సమన్వయం లోపిస్తుంది. అప్పుడు ఐదుగురు బౌలర్లతో ఆడే అవకాశం ఉండదు. ఒకవేళ రిషబ్ పంత్ను కొనసాగిస్తే.. అన్ని విధాలా సరిపోతాడు. ఐదుగురు బౌలర్లతో బరిలోకి దిగవచ్చు. సాహాను తీసుకుంటే మాత్రం అది కుదరదు. కెప్టెన్ మరోలా ఆలోచించి ఇషాన్ కిషన్ను తీసుకుంటే.. అతడు బ్యాటింగ్తో పాటు కీపింగ్లోనూ రాణిస్తాడు' అని చెప్పుకొచ్చాడు.
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా సిడ్నీ టెస్టులో రిషబ్ పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్తో ఆ టెస్ట్ డ్రా అయింది. బ్రిస్బేన్ టెస్ట్ విజయంలో మరోసారి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆసీస్ గడ్డపై 5 ఇన్నింగ్స్లలో 274 పరుగులు చేశాడు. అత్యధిక స్కోర్ 97. అదే విధంగా స్వదేశంలో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లోనూ మెరిశాడు. నిర్ణయాత్మక ఆఖరి టెస్టులో సెంచరీ (101: 118 బంతుల్లో 13x4, 2x6) చేసి తన విలువేమిటో మరోసారి చాటి చెప్పాడు. నాలుగు టెస్టుల్లో కలిపి 270 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
మార్చి 14న జస్ప్రీత్ బుమ్రా వివాహం.. ఎవరీ సంజనా గణేషన్?