మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన స్టీవ్ స్మిత్
మూడో స్థానంలో బ్యాటింగ్కు దిగిన స్టీవ్ స్మిత్ 41 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 61 పరుగులు జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఏపీ డెవిసిచ్(92) కూడా రాణించడంతో నేషనల్స్ జట్టు విజయం సాధించింది. సుదీర్ఘ విరామం తర్వాత బ్యాట్పట్టిన స్మిత్ ఈ మ్యాచ్లో ఎలా ఆడతాడో అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు.
స్మిత్ను తిరిగి మైదానంలో చూడటంతో ఫ్యాన్స్ సంతోషం
అభిమానులు కూడా స్మిత్ను తిరిగి మైదానంలో చూడటంతో సంతోషం వ్యక్తం చేశారు. స్టీవ్ స్మిత్ బ్యాటింగ్, ఫీల్డింగ్లో చురుకుగా కదులుతూ కనిపించడంతో సోషల్ మీడియాలో ఈ మ్యాచ్లో స్మిత్కు సంబంధించిన ఫొటోలను, వీడియోలను పంచుకుంటూ ‘స్మిత్ ఈజ్ బ్యాక్' అని కామెంట్లు పెడుతున్నారు.
స్మిత్పై ఏడాది నిషేధం విధించిన క్రికెట్ ఆస్ట్రేలియా
బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకున్న స్మిత్పై ఏడాది నిషేధం విధించడంతో గత కొన్ని నెలలుగా క్రికెట్కు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. కాగా, మ్యాచ్ అనంతరం స్మిత్ మాట్లాడుతూ "యాషెస్ సిరీస్ దగ్గర్నుంచి మానసికంగా ఎక్కువ ఒత్తిడి ఎదుర్కొన్నా. దాంతో కొన్ని దారుణమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. మానసికంగా ఎక్కువగా అలసిపోవడమే ఇందుకు కారణం" అని అన్నాడు.
బ్రేక్ తీసుకోవడం నాకు లాభిస్తుందనే అనుకుంటున్నా
"ప్రస్తుతం ఆసీస్ క్రికెట్ నుంచి కొంత బ్రేక్ తీసుకోవడం నాకు లాభిస్తుందనే అనుకుంటున్నా. నా పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంటానని, మళ్లీ పూర్వపు ఫామ్తో జట్టుకు సేవలందిస్తానన్న నమ్మకం ఉంది" అని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు. ఈ ఏడాది మార్చిలో సఫారీ గడ్డపై దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో బాల్ టాంపరింగ్కు పాల్పడిన స్మిత్, వార్నర్లపై క్రికెట్ ఆస్ట్రేలియా ఏడాది పాటు నిషేధం విధించిన సంగతి తెలిసిందే.