విరామం ఎంతో అవసరం:
తాజాగా కేశవ్బెనర్జీ మాట్లాడుతూ... 'ధోనీ 2004 నుంచి విరామం లేకుండా క్రికెట్ ఆడుతున్నాడు. అతనికి విరామం ఎంతో అవసరం. కుటుంబంతో కలిసి ఉండటానికి అతనికి కాస్త సమయం ఇవ్వండి. వచ్చే ఏడాది జరగబోయే 2020 టీ20 ప్రపంచకప్లో ధోనీ ఆడతాడనే నేను అనుకుంటున్నా. ఆ తర్వాతే ధోనీ తన రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు. ధోనీ సరైన సమయంలోనే రిటైర్మెంట్ ఇస్తాడు' అని అన్నారు.
యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలి:
'ధోనీ జట్టులోకి రావడం కన్నా.. యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వడమే ఇప్పుడు ముఖ్యం. దేశవాళీ క్రికెట్లో పరుగులు చేస్తూ రాణిస్తున్న వారికి అవకాశాలు ఇవ్వాలి. మంచి ప్రతిభ ఉన్న వారిని అక్కడే ఆడించి వారి కెరీర్లను నాశనం చేయొద్దు. సెలెక్టర్లు ఈ విషయాన్ని ఆలోచించాలి. వచ్చే నెలలో జరగబోయే బంగ్లాదేశ్ సిరీస్ యువ ఆటగాళ్లని పరీక్షించేందుకు సరైన వేదిక' అని కేశవ్బెనర్జీ పేర్కొన్నారు.
క్రికెట్కు తాత్కాలిక విరామం:
ప్రపంచకప్ అనంతరం ధోనీ క్రికెట్కు తాత్కాలిక విరామం ప్రకటించాడు. భారత ఆర్మీకి సేవలందిచాలనే ఉద్దేశంతో వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. దక్షిణాఫ్రికా సిరీస్కు కూడా అందుబాటులో లేడు. నవంబర్లో బంగ్లాదేశ్తో జరగనున్న టీ20 సిరీస్కు కూడా అందుబాటులో ఉండకపోవచ్చని సమాచారం. ప్రస్తుతం ధోనీ కుటుంబంతో గడుపుతున్నాడు.
ధోనీతో మాట్లాడుతా:
ప్రస్తుతం ధోనీ పరిస్థితి జట్టుతో ఉండీ లేనట్లే ఉంది. ఒకవైపు మ్యాచ్లు ఆడటం లేదు.. అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించలేదు. తాను ఆడాలనుకునే సిరీస్లు తనే ఎంపిక చేసుకుంటున్నాడు. ధోనీ సెలక్టర్లకు ఏం చెప్పాడో వారికి మాత్రమే తెలుసు. ఆ విషయాన్ని వారు బయటికి చెప్పడం లేదు. మరోవైపు కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఎలాంటి సమాచారం ఇవ్వడం లేదు. అయితే సౌరవ్ గంగూలీ తాజాగా స్పందిస్తూ... 'బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక ధోనీ భవితవ్యంపై సెలక్టర్లతో చర్చిస్తా. ఆ తర్వాత ధోనీతోనూ మాట్లాడుతా' అని అన్నారు.