
హైదరాబాద్: 'నా ఆట ఇంకా పూర్తి కాలేదు' అంటూ ఇంకా మిగిలే ఉందని చెప్పుకొస్తున్నాడు చిల్సీ కెప్టెన్ గ్యారీ కాహిల్. ప్రస్తుతం జరుగుతోన్న ప్రీమియర్ లీగ్లో భాగంగా చిల్సీ జట్టు వరుసగా విజయాలు సాధిస్తూనే ఉంది. కానీ, ఇటీవల జరిగిన మ్యాచ్లో గ్యారీ కాహిల్ ఆడలేదు. దీంతో అతనికి గోల్ చేసేందుకు అవకాశం రాలేదు. ఇదే లీగ్లో మొదటి మ్యాచ్లో గ్యారీ చేసిన గోల్ తోనే జట్టు మొదటి పాయింట్ను సంపాదించుకుంది. దీని గురించి స్పందించిన జట్టు మేనేజ్మెంట్కు గ్యారీ 'నా ఆట ఇంకా పూర్తి కాలేదు. అవసరమైతే జట్టు కోసం ఇంకా కష్టపడతాను' అని జవాబిచ్చాడు.
ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడాడు. 'నాపై ఒత్తిడి లేకుండా చూసుకుంటున్నాను. నేనెంతగా ఆడగలనో.. నా సత్తా ఏంటో నాకు తెలుసు. ఇన్నేళ్లుగా ఇంతమంది చూస్తూనే ఉన్నారు కూడా. కానీ, మ్యాచ్లో ఫిట్నెస్ పొందడం కోసం ప్రయత్నిస్తున్నాను. మళ్లీ ఫామ్లోకి వచ్చి సత్తాను తిరిగి చాటేందుకే పూనుకున్నాను. ఫుట్బాల్ అనేది ఓ రోలర్కోస్టర్ లాంటిది. ఎప్పుడూ ఒకేలా ఉండదు. క్లుప్తంగా అంటే, ప్రదర్శన అంతగా
చేయలేకపోయాను' అని చెప్పుకొచ్చాడు.
'ఇంతటితోనే ఆట ముగిసిపోయిందనుకుంటే ఎలా. రోజూ ఆటను మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాను.' అని ముగించాడు. అనంతరం సహచర ఆటగాడు ఆంటోనీ మోస్సే గత మ్యాచ్లో చూపించిన ఫామ్ను ఇలానే కొనసాగిస్తునంటూ నమ్మకం వ్యక్తం చేస్తున్నాడు. ఈ సందర్భంగా ఆంటోనీ మోస్సే మాట్లాడుతూ.. ఆట ఆరంభం నుంచి పాయింట్లు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తాం. ప్రతి గేమ్ను విజయంతో ముగించాలని ఉవ్విళ్లూరుతుంటాం. ఇంతకుముందు చెప్పినట్లే.. మా ఆటగాళ్లపైన నమ్మకం ఉంచాం. ఆదివారం ఆడిన గేమ్లో ఇలాంటి ఉత్సాహంతోనే ఆడి గెలిచాం' అని పేర్కొన్నాడు.
ఇదే ప్రీమియర్ లీగ్లో ఆడుతున్న ఆస్లే బార్నెస్ చిల్సీ నాణ్యమైన ఆట ఆడుతోందని కొనియాడాడు. జట్టు ఆటగాళ్లందరినీ ప్రశంసించాడు. 'ఆట ప్రథమార్థంలోనూ.. ద్వితీయార్థంలోనూ ఒకే స్థాయిని కొనసాగించాం. ఇంకా 4గేమ్ల వరకూ ఆడాల్సి ఉంది. వాటిలో సత్తా ఏంటో చూపిస్తాం' అని చెప్పుకొచ్చాడు.