ఫెర్గూసన్కు కరోనా నెగిటివ్:
జట్టు బస చేసిన హోటల్లో ఫెర్గూసన్ను ప్రత్యేకంగా ఉంచింది. కరోనా వైరస్కు సంబంధించి పరీక్షలకు పంపడంతో పాటు.. 24 గంటల పాటు ఎవరితో కలవకుండా హోటల్ రూమ్లోనే నిర్బంధించింది. ఇక శనివారం అతని రిపోర్ట్లు నెగెటివ్గా రావడంతో.. ఫెర్గూసన్తో పాటు కివీస్ బోర్డు ఊపిరి పీల్చుకొంది. ఇక కరోనా కారణంగా ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ సిరీస్ రద్దవడంతో.. ఫెర్గూసన్ ఆక్లాండ్లోని తన ఇంటికి చేరుకున్నాడు.
కాస్త జలుబు చేసిందంతే:
ఆక్లాండ్ చేరుకున్న లాకీ ఫెర్గూసన్ తనకు జరిగిన అనుభవాన్ని వివరించాడు. 'నా ఆరోగ్యంపై చాలా మంది ఆందోళన చెందారు. నేను బాగానే ఉన్నానని వారందరికీ సమాధానమిచ్చా. నాకు కాస్త జలుబు చేసిందంతే. అంతకుమించి ఏమీ కాలేదు. జట్టు వైద్యులు నిబంధనలు అమలు చేశారు కాబట్టి అర్థం చేసుకోగలను. కానీ.. మొత్తంగా చూస్తే అంతా అతి చేసినట్లు అనిపిస్తోంది' అని ఫెర్గూసన్ పేర్కొన్నాడు.
రిచర్డ్సన్కు గొంతు నొప్పి:
తొలి వన్డేకు ముందు ఆసీస్ పేసర్ కేన్ రిచర్డ్సన్ సైతం గొంతు నొప్పితో బాధపడ్డాడు. క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) వెంటనే అతనికి కరోనా పరీక్షలు చేయించింది. అతడికి నెగెటివ్ అని రిపోర్ట్ రావడంతో జట్టు సభ్యులు ఊపిరిపీల్చుకున్నారు. రిచర్డ్సన్కు గొంతు నొప్పి ఉడడంతో శుక్రవారం కివీస్తో జరిగిన తొలి వన్డేకు దూరమయ్యాడు. రిచర్డ్సన్కు బదులు సీన్ అబాట్ను సీఏ ఎంపిక చేసింది. అయితే టెస్టుల అనంతరం రిచర్డ్సన్ మైదానానికి వెళ్ళాడు. సిరీస్ రద్దవడంతో ఇంటికి వెళ్ళిపోయాడు.
వన్డే సిరీస్ రద్దు:
ఆస్ట్రేలియాతో జరగనున్న వన్డే సిరీస్తో పాటు మూడు టీ20ల సిరీస్ను న్యూజిలాండ్ అర్థంతరంగా రద్దు చేసుకుంది. అయితే వన్డే సిరీస్లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి వన్డేలో ఆసీస్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దేశంలో కరోనా వైరస్ను అరికట్టడానికి ఆస్ట్రేలియా, ఇతర దేశాల నుంచి న్యూజిలాండ్కు వచ్చే వారిని 14 రోజుల పాటు ఐసోలేషన్ వార్డులో ఉంచాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. కాగా ఆదివారం అర్థరాత్రి తర్వాత నుంచి వచ్చిన వారిని ఏయిర్ పోర్ట్లోనే నిర్బంధంలోకి తీసుకొని ఐసోలేషన్ వార్డుకు తరలించాలని ఆదేశించింది. దీంతో ఆసీస్ పర్యటనలో ఉన్న కివీస్ జట్టు మేనేజ్మెంట్ అప్రమత్తం అయింది.