హైదరాబాద్: రంజీల్లో ఢిల్లీ జట్టుకి విరాట్ కోహ్లీని ఎంపిక చేసేందుకు అప్పట్లో తాను చాలా పోరాడాల్సి వచ్చిందని మాజీ పేసర్, ఢిల్లీ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అతుల్ వాసన్ వెల్లడించాడు. దుబాయికి చెందిన పత్రిక ఖలీజ్ టైమ్స్కు ఇచ్చిన ఇంటర్యూలో అతుల్ వాసన్ మాట్లాడుతూ "ఢిల్లీ మేనేజ్మెంట్ అప్పట్లో విరాట్ కోహ్లీ, ఇషాంత్ శర్మని జట్టులోకి తీసుకునేందుకు ఇష్టపడలేదు" అని అన్నాడు.
ఆసియా కప్లో అరుదైన ఘనత: సచిన్, ద్రవిడ్ సరసన శిఖర్ ధావన్
"ఎందుకంటే అప్పట్లో వారు అండర్-19కి ఆడేవారు. కానీ, వారిద్దరూ ఢిల్లీ జట్టుకి రంజీల్లో ఆడాలని నేను పట్టుబట్టి.. పోరాడి ఎంపిక చేశాను. ఆ తర్వాత వారు ఏ స్థాయికి చేరుకున్నారో మీరే చూస్తున్నారు. 11 ఏళ్ల వయసులోనే విరాట్ కోహ్లీ నా అకాడమీకి వచ్చాడు. అప్పటి నుంచి అతని ఆటని నేను గమనిస్తూ వచ్చాను" అని అతుల్ వాసన్ వెల్లడించాడు.
2006 నవంబరులో ఢిల్లీ తరఫున అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ తమిళనాడుతో జరిగిన మ్యాచ్లో 10 పరుగులకే ఔటైపోయాడు. అతనితో పాటు అదే మ్యాచ్లో అరంగేట్రం చేసిన ఇషాంత్ శర్మ మాత్రం నాలుగు వికెట్లతో మెరిశాడు. అదే ఏడాది కర్ణాటకతో జరిగిన మ్యాచ్లో కోహ్లీ 90 పరుగులు చేయడంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చాడు.
అదే ఏడాది కోహ్లీ తన తండ్రిని కోల్పోయాడు. రెండేళ్ల అనంతరం అండర్-19 ప్రపంచకప్లో భారత్ జట్టుని విజేతగా నిలిపిన కోహ్లీ.. అనతికాలంలో టీమిండియాలోకి అడుగుపెట్టాడు. తన సామర్థ్యంపై నమ్మకం ఉండటం వల్లే మైదానంలో కోహ్లీ దూకుడుగా వ్యవహారిస్తున్నాడని అతుల్ వాసన్ వెల్లడించాడు.
ప్రస్తుతం టీమిండియా యూఏఈ వేదికగా జరుగుతున్న ఆసియా కప్లో బిజీగా ఉంది. వర్క్ లోడ్, రాబోయే సిరిస్లను దృష్టిలో పెట్టుకుని ఆసియా కప్ టోర్నీ నుంచి విరాట్ కోహ్లీకి సెలక్టర్లు విశ్రాంతినిచ్చారు.