'గంభీర్ వల్లే ఈ స్థాయిలో ఉన్నా:
వెస్టిండీస్ టూర్కు ఎంపికయిన సందర్భంగా నవదీప్ సైనీ మాట్లాడుతూ... 'ఎలాంటి అనుభవం లేని నన్ను నేరుగా ఢిల్లీ రంజీ జట్టులో చేర్చుకునేందుకు గౌతం గంభీర్ తాపత్రయపడ్డాడు. నా కెరీర్లో గంభీర్ సహకారాన్ని ఎప్పటికీ మరిచిపోలేను. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కారణం అతడే. నేను ఏమైనా సాధిస్తే.. అందులో గంభీర్ పేరు తప్పక ఉంటుంది. నా తల్లిదండ్రుల తర్వాత నాకన్నీ అతడే' అని సైనీ తెలిపాడు.
మ్యాచ్కు రూ.200:
2013 వరకు సైనీ క్రికెట్ బంతితోనే ఆడలేదు. హరియాణాలో జరిగే స్థానిక టోర్నీల్లో టెన్నిస్ బంతులతో క్రికెట్ ఆడేవాడు. ఇందుకోసం అతడికి మ్యాచ్కు రూ.200 ఇచ్చేవారు. ఢిల్లీ మాజీ పేసర్ సుమీత్ నర్వాల్ ఆధ్వర్యంలో కర్నాల్ ప్రీమియర్ లీగ్ సమయంలో సైనీ పేస్ను చూసి నర్వాల్ ఆశ్చర్యపోయాడు. అతడిని వెంటనే ఢిల్లీ జట్టు నెట్స్కు పంపాడు. అక్కడ కెప్టెన్ గంభీర్ దృష్టిలో పడ్డాడు. వెంటనే అతడికి జత షూస్ను కొనిచ్చి రెగ్యులర్గా నెట్స్కు రమ్మన్నాడు.సైనీని ఢిల్లీ రంజీ జట్టులోకి తీసుకునేందుకు గంభీర్ సెలెక్టర్లతో పోరాడడంతో చివరకు 2013-14 సీజన్లో సైనీ రంజీలోకి వచ్చాడు.
13 మ్యాచ్ల్లో 11 వికెట్లు:
2015-16లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ద్వారా సైనీ టీ20 అరంగేట్రం చేశాడు. ఢిల్లీ డేర్డెవిల్స్ మరుసటి ఏడాది రూ.10 లక్షలకు వేలంలో కొనుక్కుంది. అయితే జహీర్, షమీ, కమిన్స్, మోరిస్, రబాడ వంటి టాప్ బౌలర్లు ఉండడంతో మ్యాచ్లు ఆడే అవకాశం రాలేదు. సీజన్-12లో బెంగళూరు తరఫున తొలి మ్యాచ్తోనే అరంగేట్రం చేసాడు. 13 మ్యాచ్ల్లో 11 వికెట్లు తీశారు. రబాడ (154.23 కి.మీ) తర్వాత అత్యధిక వేగం (152.85 కి.మీ)తో బంతి విసిరిన బౌలర్గా నిలిచాడు. అనంతరం ప్రపంచకప్లో భారత ఆటగాళ్లకు ప్రాక్టీస్ నెట్ బౌలర్గా కూడా వెళ్ళాడు.
4 మ్యాచ్లు.. 8 వికెట్లు:
ఇక భారత్-ఏ జట్టు తరఫున వెస్టిండీస్ పర్యటనలో సైనీ అదరగొట్టాడు. ఆంటిగ్వాలో జరిగిన రెండో మ్యాచ్లో 5/46తో మెరుగైన ప్రదర్శన చేసాడు. ఈ సిరీస్లో నాలుగు మ్యాచ్లాడిన సైనీ 8 వికెట్లు తీసాడు. ఖలీల్ అహ్మద్ (9) తర్వాత అత్యధిక వికెట్లు సాధించిన బౌలర్గా నిలిచాడు. దీంతో వెస్టిండీస్ టూర్కు ఎంపికయ్యాడు.