సీఎస్కేకు సవాళ్లు ఎదురవుతాయి:
వ్యాఖ్యాత సంజయ్ మంజ్రేకర్తో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన ఓ ఇంటర్వ్యూలో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ ఆటగాడు హస్సీ మాట్లాడుతూ మహీపై ప్రశంసల వర్షం కురిపించాడు. 'నిత్యం మద్దతుగా ఉండే ఫ్రాంచైజీ యాజమాన్యం, కోచ్ స్టిఫెన్ ఫ్లెమింగ్, కెప్టెన్ ధోనీ వల్లే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఐపీఎల్లో ఇంతకాలం నిలకడగా రాణించింది. చెన్నై జట్టులో ధోనీ, ఫ్లెమింగ్ మధ్య సమన్వయం గొప్పగా ఉంటుంది. అయితే ధోనీ జట్టు నుంచి వెళ్లిపోయిన తర్వాత సీఎస్కేకు సవాళ్లు ఎదురవుతాయి. కొత్త జట్టును తయారుచేయాల్సి ఉంటుంది' అని హస్సీ అన్నాడు.
కొత్త జట్టును తయారు చేసుకోవాలి:
'ఐపీఎల్ మొదటి దశాబ్దంలో సీఎస్కే అద్భుతంగా రాణించింది. తర్వాతి దశాబ్దంలో చెన్నై సవాళ్లు ఎదుర్కొనబోతోంది. ఎందుకంటే.. ఎదోఒకరోజు కెప్టెన్ ధోనీ వేరే జట్టుకు వెళ్లడమో లేదా ఆడాకపోవడమో జరుగుతుంది. అప్పుడు కొత్త జట్టును తయారుచేయాల్సి ఉంటుంది. దీని కోసం జట్టుతో ధోనీ తన బంధాన్ని కొనసాగించాలని సీఎస్కే యాజమాన్యం కోరుతుందని భావిస్తున్నా' అని హస్సీ తెలిపాడు. ధోనీ భారత్ తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడాడు. ఇక 190 ఐపీఎల్ మ్యాచులు ఆడాడు.
ధోనీ, పాంటింగ్ ఆలోచనలు స్థిరంగా ఉంటాయి:
'ప్రపంచ క్రికెట్ చరిత్రలో ధోనీనే అత్యుత్తమ ఫినిషర్. ప్రశాంతంగా ఉంటూ ప్రత్యర్థి జట్టు సారథి ఆలోచనలను రెప్పపాటులో అంచనా వేయగలడు. అతడికి అపారమైన శక్తి ఉంది. ఎప్పుడు ఎలా ఆడాలనే విషయంపై తనకి పూర్తి స్పష్టత ఉంటుంది. అలాంటి నైపుణ్యం నాకు లేదు. ఓవర్లో ఎక్కువ పరుగులు సాధించడమే అతడి నుంచే నేర్చుకున్నా. గొప్ప ఆటగాళ్లు ఓటమి చవిచూస్తే దాని గురించి ఎక్కువ సేపు ఆలోచించరు. గెలుపోటములకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వరు. ధోనీ, పాంటింగ్ వంటి వారి ఆలోచనలు స్థిరంగా ఉంటాయి' అని హస్సీ తెలిపాడు.
రేసులో పంత్, రాహుల్:
2019 వన్డే ప్రపంచకప్ తర్వాత ఎంఎస్ ధోనీ టీమిండియాకి దూరమయ్యాడు. బీసీసీఐ సెలక్షన్కు కూడా అందుబాటులో ఉండడం లేదు. మహీ స్థానంలో రిషబ్ పంత్, కేఎల్ రాహుల్కి భారత సెలక్టర్లు వరుసగా అవకాశాలిచ్చారు. ఈ ఇద్దరిలో పంత్ ఫెయిలవగా.. రాహుల్ వన్డే, టీ20ల్లో వికెట్ కీపర్-బ్యాట్స్మెన్గా రాణించాడు. దీంతో టీ20 ప్రపంచకప్ జట్టులోనూ రాహుల్కి అవకాశమివ్వాలని మాజీలు సూచిస్తున్నారు.