న్యూస్ పేపర్లు చదవలేదు..
‘కాలింగ్ ఉడ్ వేసిన బంతి ఆఫ్ వికెట్కు తగిలినట్లు అనిపించింది. కొంత సందేహం కలిగినప్పటికీ బెన్ఫిట్ ఆఫ్ బౌలర్గా భావించి ఔటిచ్చా. నా నిర్ణయంపై సచిన్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయిష్టంగానే క్రీజును వీడాడు. ఆ తర్వాత రిప్లేలో బంతి ఆఫ్ స్టంప్కు ఇంచ్ దూరంగా వెళ్లినట్లు స్పష్టమైంది. నా ఈ తప్పుడు నిర్ణయంపై యావత్ క్రికెట్ ప్రపంచం ఎలా స్పందిస్తుందో ముందే ఊహించా. అందుకే నేను కనీసం క్రిక్ఇన్ ఫో కూడా ఓపెన్ చేయలేదు. న్యూస్ పేపర్లు కూడా చదవలేదు.
చూడు సైమన్..
ఆ మరుసటి రోజే.. మార్నింగ్ వాక్ చేస్తుండగా.. సచిన్ నా ముందు నుంచి వెళ్లాడు. నేను వెంటనే అతని దగ్గరకు వెళ్లి చూడు సచిన్.. నిన్న నిన్ను తప్పుగా ఔటిచ్చాను తెలుసా? నా నిర్ణయం తప్పని తర్వాత తెలిసిందని చెప్పా. దానికి సచిన్ ‘చూడు సైమన్.. నువ్వు తప్పిచ్చావని నాకు తెలుసు. కానీ నువ్వు మంచి అంపైర్. నీవేం తరుచూ తప్పిదాలు చేయవు. ఇట్స్ ఓకే. దీని గురించి దిగులు చెందకు'అని నాతో అన్నాడు. ఆ క్షణమే సచిన్పై నాకు గౌరవం పెరిగింది.'అని సైమన్ చెప్పుకొచ్చాడు.
ఫేవర్గా ఇచ్చినప్పుడు..
మరోసారి తన తప్పుడు నిర్ణయం వల్ల సచిన్ ఔట్ కాకుండా కూడా తప్పించుకున్నాడని సైమన్ టఫెల్ గుర్తు చేసుకున్నాడు. 2005లో శ్రీలంకతో ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్లో సచిన్ 35వ సెంచరీ సాధించాడు. అయితే ఈ మ్యాచ్లో సచిన్ బ్యాటింగ్ చేస్తుండగా.. 24 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద దిల్హర ఫెర్నాండో, 38 రన్స్ వద్ద ముత్తయ్య మురళీ ధరణ్ ఎల్బీడబ్ల్యూకోసం అప్పీల్ చేశారు. అంపైర్ టఫెల్ మాత్రం ఔటివ్వలేదు. కానీ ఇందులో ఏది తప్పుడు నిర్ణయం స్పష్టం చేయలేదు. కానీ సచిన్ మాత్రం ఔట్ కాకుండా తప్పించుకున్నాడన్నాడు.
ఏ ఒక్కరూ మాట్లాడరు..
‘ఫిరోజ్ షా కోట్లా వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరిగిన మ్యాచ్లో ప్రారంభంలోనే సచిన్ వికెట్ల ముందు దొరికిపోయాడు. కానీ నేను పొరపాటుగా నాటౌట్ ఇచ్చా. అనంతరం సచిన్ రికార్డు సెంచరీ సాధించాడు. అయితే దీని గురించి ఏ ఒక్కరు మాట్లాడరు. గుర్తు చేయరు. యూట్యూబ్లో కూడా ఉండదు. కానీ సచిన్ను 91 పరుగుల వద్ద అన్యాయంగా ఔటిచ్చాడని మాత్రం అంటారు. నాటౌట్ ఇవ్వడంతో సెంచరీ చేసాడనే విషయాన్ని మాత్రం ఏ ఒక్కరూ ప్రస్తావించరు. ఇక ఆ సమయంలో శ్రీలంక కోచ్గా ఉన్న టామ్ మూడీ నా తప్పుడు నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశాడు'అని సైమన్ గుర్తు చేసుకున్నాడు.