భారత్, బంగ్లాదేశ్ వన్డే సిరీస్కు ఎవరూ ఊహించని ఆరంభం లభించింది. తొలి వన్డేలో భారత జట్టును బంగ్లాదేశ్ అనూహ్యంగా ఓడించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో భారత బ్యాటింగ్ లైనప్ పూర్తిగా విఫలమైంది. మధ్యలో కేఎల్ రాహుల్ (73) రాణించకుంటే కనీసం 186 పరుగులు కూడా చేసేది కాదు. అయితే భారత బౌలర్లు రాణించారు. కానీ చివరి వికెట్ తీసుకోవడంలో వాళ్లు కూడా విఫలం అవడంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు.
తొలి వన్డేలో దురదృష్ట వశాత్తూ అవుటైన బ్యాటర్ విరాట్ కోహ్లీ. తనకు బాగా నచ్చిన డ్రైవ్ చేస్తూనే అతను పెవిలియన్ చేరాడు. బంగ్లా తాత్కాలిక కెప్టెన్ లిటాన్ దాస్ అందుకున్న సూపర్ క్యాచ్తో అవుటయ్యాడు. ఆ క్యాచ్ దాస్ అందుకుంటాడని ఎవరూ ఊహించలేదు. నెలరోజులపైగా విశ్రాంతి తీసుకున్న తర్వాత విరాట్ కోహ్లీ అద్భుతమైన ఫామ్లో కనిపించాడు. టీ20 వరల్డ్ కప్లో కూడా కొన్ని మ్యాచుల్లో భారత జట్టును ఒంటి చేత్తో గెలిపించాడు.
అయితే అచ్చొచ్చిన వన్డే ఫార్మాట్లో మాత్రం అతను పెద్దగా రాణించలేదు. ఈ ఏడాది వన్డేల్లో కోహ్లీ పేలవ ఫామ్ కొనసాగుతూనే ఉంది. ఇక రెండో వన్డేలో అయినా కోహ్లీ రాణిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ ఫార్మాట్లో కూడా సెంచరీ చేస్తాడని ఆశిస్తున్నారు. కానీ తొలి వన్డేలో ఉన్నటువంటి పిచ్నే కనుక తయారు చేస్తే బ్యాటర్లు మరోసారి పరుగుల కోసం చెమటోడ్చక తప్పదు. ఫాస్ట్ బౌలర్లకు కొంత బౌన్స్ కూడా దక్కడంతో బ్యాటర్లు మరింత ఇబ్బంది పడతారు.
రెండో వన్డేకు వరుణుడి ముప్పు ఏమాత్రం లేదని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. పిచ్ కూడా తొలి మ్యాచ్కు ఇచ్చినటు వంటిదే ఇస్తారని సమాచారం. కాబట్టి ఇక్కడ కనీసం 230 పరుగులు చేసినా కాపాడుకునే ఛాన్స్ ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. మరి భారత్ ఏం చేస్తుందో చూడాలి.