హైదరాబాద్: ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఇటీవల ముగిసిన వన్డే సిరీస్లో భారత జట్టు ఎంపికపై విమర్శల పర్వం కొనసాగుతోంది. ఇంగ్లాండ్తో ఇటీవల ముగిసిన మూడో వన్డేలో కేఎల్ రాహుల్కి తుది జట్టులో చోటివ్వకపోవడంపై టీమిండియా క్రికెట్ దిగ్గజాలైన మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ పెదవి విరచగా.. తాజాగా జట్టు ఎంపిక తీరును విమర్శిస్తూ మాజీ సెలక్టర్ దిలీప్ వెంగ్సర్కార్ కూడా వార్తల్లోకొచ్చాడు.
విదేశీ పర్యటనకు ముందు టీమిండియా అఫ్గానిస్థాన్తో టెస్టు మ్యాచ్లో ఆడింది. ఈ మ్యాచ్కు భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన అజింక్య రహానెకి.. వన్డే జట్టులో చోటివ్వకపోవడంపై పెదవి విరిస్తూ.. అతని ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసేందుకే ఇలా చేసినట్లు ఉందని ఈ మాజీ సెలక్టర్ వివరించాడు.
'భారత జట్టులో అసలేం జరుగుతోంది..? జట్టులో అగ్రశ్రేణి ఆటగాళ్లతో కుర్చీలాట ఆడుతున్నారా..? బ్యాటింగ్ ఆర్డర్లో జట్టుకి 3, 4వ స్థానాలు ఆడే ఆటగాళ్లు కీలకం. అలాంటి స్థానాల్లో జట్టులో రెగ్యులర్గా అవకాశాలు దక్కని ఆటగాళ్లను ఆడిస్తుంటారా..? ఇలా చేయడంతోనే వన్డేలో ఇప్పటికీ 4వ స్థానంలో మెరుగైన ఆటగాడు దొరకలేదు. అఫ్గానిస్థాన్తో టెస్టుకి కెప్టెన్గా పనిచేసిన రహానెని.. వెంటనే వన్డే జట్టు నుంచి ఎలా తప్పిస్తారు..? అంటే జట్టులోని అగ్రశ్రేణి బ్యాట్స్మెన్పై మీకు నమ్మకం లేదా..?' అని వెంగ్సర్కార్ ప్రశ్నించాడు.
ఇక, కేఎల్ రాహుల్, అజింక్యా రహానెలను జట్టు ఉపయోగించుకోవడం లేదని దాదా ఇంతకుముందే ఎండగట్టాడు. ఇకనైనా వాళ్లకు సరైన అవకాశాలు ఇచ్చి జట్టును గెలిపించుకునే ప్రయత్నాలు చేయమంటూ చెప్పుకొచ్చాడు. మిడిలార్డర్లో... టాప్ నుంచి నాలుగో స్థానంలో ఆడే బ్యాట్స్మన్ను మంచి ఆటతీరు కనబర్చే ప్లేయర్ను ఎంచుకోవాలని సూచించాడు. దీనికి కేఎల్ రాహుల్ సరిపోతాడని అయితే అతనిని తుది జట్టులో క్రమంగా తీసుకుంటుండటం పట్ల అతని ఆట మెరుగుపడుతుందని పేర్కొన్నాడు.