కథ ముగిసిపోలేదు..
పాయింట్ల పట్టికలో తొలి నాలుగు స్థానాల్లో ఉన్న జట్లల్లో ఆస్ట్రేలియా మాత్రమే బేఫికర్గా సెమీఫైనల్కు చేరుకుంది. ఆ అవకాశం ఇంకా ఎవరి తలుపూ తట్టలేదు. టీమిండియా సహా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లకు ఇంకా సెమీ ఫైనల్ బెర్త్ ఖరారు కాలేదు. ఆయా టీమ్లన్నీ కనీసం ఒక్క మ్యాచ్ను అయినా గెలవాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. భారత్, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు కనీసం ఒక్క మ్యాచ్ అయినా గెలిచి తీరాల్సి ఉంది. గెలిస్తే- ఆస్ట్రేలియా తరహాలో నేరుగా సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకుంటాయి. లేదా- ఇతర జట్ల జయాపజయాలు, సమీకరణాల మీదే ఆధారపడాల్సి ఉంటుంది.
భారత్ సెమీస్ చేరాలంటే..
టీమిండియా ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండోస్థానంలో కొనసాగుతోంది, ఆడిన ఏడు మ్యాచుల్లో ఒకటి వర్షం వల్ల రద్దు కాగా.. అయిదింట్లో విజయం సాధించింది. ఇంగ్లండ్తో జరిగిన మ్యాచ్లో ఓటమి పాలైంది. ప్రస్తుతం 11 టీమిండియాకు ఉన్న పాయింట్లు 11. మరో రెండు మ్యాచ్లను ఆడాల్సి ఉంది. ఒకటి- బంగ్లాదేశ్తో, మరొకటి శ్రీలంకతో. బంగ్లాదేశ్తో మ్యాచ్ మరి కొన్ని గంటల్లో బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్ స్టేడియంలో ఆరంభం కాబోతోంది. బంగ్లాదేశ్ లేదా శ్రీలంక.. ఈ రెండు జట్లల్లో టీమిండియా ఏ ఒక్కదానిపైన విజయం సాధించినా నేరుగా సెమీస్కు చేరుకుంటుంది. అందులో సందేహాలు అక్కర్లేదు. ఓడితే మాత్రం ప్రమాదంలో పడినట్టే.
బ్లాక్ క్యాప్స్ పరిస్థితేంటీ..
ప్రస్తుత ప్రపంచకప్లో ఆరంభం నుంచీ ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు న్యూజిలాండ్. ఒక్క మ్యాచ్ గెలిస్తే- సెమీ ఫైనల్ బెర్త్ ఖరారు అవుతుందనుకున్న మ్యాచ్లో చతికిల పడింది. ఆ మ్యాచ్లో పాకిస్తాన్ను ఎదుర్కొంది. దారుణంగా ఓటమి పాలైంది. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో అయిదింట్లో విజయం సాధించింది. రెండింట్లో ఓడిపోయింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతూ వస్తోంది. ఇంకా ఇంగ్లండ్ను ఢీ కొట్టాల్సి ఉంది కివీస్. గురువారం చెస్టర్ లీ స్ట్రీట్లోని రివర్సైడ్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో కివీస్ ఓడినా, గెలిచినా మెరుగైన రన్ రేట్ ఒక్కటే సెమీఫైనల్ చేరడానికి అవకాశాన్ని కల్పిస్తుంది.
పాకిస్తాన్కు ఉన్న ఒకే ఒక్క ఆశ..
పాకిస్తాన్ పరిస్థితి వాటన్నింటికీ భిన్నం. ఆడిన ఎనిమిది మ్యాచుల్లో నాలుగింట్లో ఓడిపోయి, మూడు మాత్రమే గెలిచింది. ఒక మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ప్రస్తుతం పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ను ఢీ కొట్టాల్సి ఉంది.. ఈ మ్యాచ్ ఈ నెల 5వ తేదీన లండన్లోని లార్డ్స్ మైదానంలో జరుగనుంది. ఇందులో తొలుత బ్యాటింగ్ వెళ్తే 400లకు పైగా పరుగులను చేయాల్సి ఉంటుంది పాకిస్తాన్కు. అదే సమయంలో- బంగ్లాదేశ్ను అతి తక్కువ స్కోరుకు, అతి తక్కువ బంతుల్లో ఆలౌట్ చేయాల్సి ఉంటుంది. ఫలితంగా రన్రేట్ మెరుగుపడుతుంది. లేదా తొలుత ఫీల్డింగ్ చేయాల్సి వస్తే- బంగ్లాదేశ్ను అతి తక్కువ బంతుల్లో, తక్కువ పరుగులకు ఆలౌట్ చేయడంతో పాటు- లక్ష్యాన్ని కనీసం ఏడు నుంచి ఎనిమిది రన్రేట్తో ఛేదించాల్సి ఉంటుంది.
రన్ రేట్ ఒక్కటే కాపాడేది..
అలా చేయడంతో పాటు- ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య జరిగే మ్యాచ్ ఫలితం కోసం ఎదురు చూడక తప్పదు. ఈ మ్యాచ్ ఫలితం, గెలిచిన జట్టు రన్రేట్ మీద పాకిస్తాన్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. బంగ్లాదేశ్ను పాకిస్తాన్ భారీ తేడాతో ఓడించడంతో పాటు, న్యూజిలాండ్ జట్టు ఇంగ్లండ్ చేతిలో ఓడిపోవాల్సి ఉంటుంది. ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లు తమ చివరి మ్యాచుల్లో గెలిచాయనే అనకుంటే.. రన్రేట్ను పరిగణనలోకి తీసుకుంటారు. న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్ల రన్రేట్ను పరిశీలిస్తారు. మెరుగైన రన్రేట్ ఎవరు సాధిస్తారో.. వారికి సెమీఫైనల్ గడప తొక్కే ఛాన్స్ లభిస్తుంది.
బంగ్లాదేశ్కూ ఉంది ఓ అవకాశం..
సెమీఫైనల్ చేరే అవకాశం బంగ్లాదేశ్కు సైతం ఉంది. దీనికోసం పాకిస్తాన్, భారత జట్లను బంగ్లాదేశ్ భారీ తేడాతో ఓడించాల్సి ఉంటుంది. న్యూజిలాండ్ చేతిలో ఇంగ్లండ్ భారీ తేడాతో పరాజయం పాలు కావాల్సి ఉంటుంది. ఈ రెండింట్లో ఏది జరిగినా బంగ్లాదేశ్.. సగర్వంగా సెమీఫైనల్కు చేరుకోగలుగుతుంది. ఇక శ్రీలంక, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్ ఇంటిదారి పట్టేశాయి. డ్రెస్సింగ్ రూమ్లను ఖాళీ చేస్తాయి.