చరిత్ర అనుకూలంగా లేదు, కానీ: 5 టీ20ల సిరిస్లో గెలుపే లక్ష్యంగా కోహ్లీసేన బరిలోకి!

హైదరాబాద్: గతేడాది మాంచెస్టర్ వేదికగా ప్రపంచకప్ సెమీస్ ఓటమి అనంతరం కోహ్లీసేన తొలిసారి న్యూజిలాండ్తో పోరుకు సిద్ధమైంది. కివీస్ గడ్డపై ఆరు వారాల సుదీర్ఘ పర్యటనలో భాగంగా టీమిండియా 5 టీ20లు, 3 వన్డేలతో పాటు 2 టెస్టులు ఆడనుంది. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ ఇరు జట్ల మధ్య శుక్రవారం ఆక్లాండ్లోని ఈడెన్ పార్క్ వేదికగా ప్రారంభమైంది.
ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ న్యూజిలాండ్ జట్టుని బ్యాటింగ్కు ఆహ్వానించాడు. అయితే, తొలి టీ20కి ముందు నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రపంచకప్ ఓటమికి రివేంజ్ తీసుకుంటారా? అన్నప్రశ్నకు.. కివీస్ ఆటగాళ్లు చాలా సున్నితమైన మనస్కులని, వారిని చూస్తే అలా అనిపించదని కోహ్లీ నవ్వుతూ సమాధానమిచ్చాడు.
ఏదేమైనా... ఈ ఏడాది అక్టోబర్లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో కివీస్ పర్యటనను టీమిండియా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఐదు టీ20ల సిరిస్లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తోంది. అయితే, టీ20ల్లో న్యూజిలాండ్పై టీమిండియా పేలవ రికార్డుని కలిగి ఉండటం ఆందోళన కలిగించే అంశం...

టీ20 క్రికెట్లో టీమిండియా
2019లో హోమ్ సీజన్ ప్రారంభం కావడానికి ముందే టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా స్థానంపై చాలా చర్చలు జరిగాయి. ప్రస్తుతం ర్యాంకింగ్స్లో 5వ స్థానంలో ఉన్న టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరిస్లో పేలవ ఆరంభం చేసింది. ఆ తర్వాత శ్రీలంక, వెస్టిండిస్, బంగ్లాదేశ్లపై సిరీస్ విజయాలు సాధించింది. ముఖ్యంగా వెస్టిండిస్, బంగ్లాదేశ్లతో జరిగిన టీ20 సిరిస్ల్లో ఓటమి నుంచి టీమిండియా పుంజుకున్న తీరు అద్భుతం.

కివీస్పై టీమిండియా పేలవ రికార్డు
న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరిస్కు సిద్ధమైన వేళ టీమిండియా పేలవ రికార్డుని కలిగి ఉంది. మిగతా జట్లతో పోలిస్తే టీ20ల్లో న్యూజిలాండ్పై టీమిండియా పెద్దగా రాణించలేదు. ఇరుజట్ల మధ్య ఆడిన 11 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ 8 మ్యాచ్లు నెగ్గగా, టీమిండియా కేవలం 3 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. అంతేకాదు టీ20ల్లో న్యూజిలాండ్పై భారత్ ఎప్పుడూ వరుస మ్యాచ్ల్లో గెలవలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన గత ఐదు మ్యాచ్ల్లో టీమిండియా కేవలం ఒక మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. అది కూడా 2019లో సిరీస్ 1-2తో ఓడిపోయినప్పుడు.

న్యూజిలాండ్ జట్టుని వేధిస్తోన్న గాయాలు
మరోవైపు న్యూజిలాండ్ జట్టులోని ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ మరియు లాకీ ఫెర్గూసన్ లేకుండా ఆతిథ్య జట్టు బరిలోకి దిగుతోంది. ఇటీవలే సొంతగడ్డపై ఇంగ్లాండ్తో ఐదు టీ20ల సిరిస్ను 2-3తో చేజార్చుకోవడంతో భారత్తో సిరిస్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు టీమిండియా సైతం శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్ వంటి స్టార్ ప్లేయర్లు లేకుండానే ఈ సుదీర్ఘ సిరిస్ ఆడనుంది. అయితే, వారి స్థానాన్ని భర్తీ చేసే అటగాళ్లు భారత జట్టులో ఉండటం విశేషం.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications