టీ20 క్రికెట్లో టీమిండియా
2019లో హోమ్ సీజన్ ప్రారంభం కావడానికి ముందే టీ20 ర్యాంకింగ్స్లో టీమిండియా స్థానంపై చాలా చర్చలు జరిగాయి. ప్రస్తుతం ర్యాంకింగ్స్లో 5వ స్థానంలో ఉన్న టీమిండియా స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరిస్లో పేలవ ఆరంభం చేసింది. ఆ తర్వాత శ్రీలంక, వెస్టిండిస్, బంగ్లాదేశ్లపై సిరీస్ విజయాలు సాధించింది. ముఖ్యంగా వెస్టిండిస్, బంగ్లాదేశ్లతో జరిగిన టీ20 సిరిస్ల్లో ఓటమి నుంచి టీమిండియా పుంజుకున్న తీరు అద్భుతం.
కివీస్పై టీమిండియా పేలవ రికార్డు
న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరిస్కు సిద్ధమైన వేళ టీమిండియా పేలవ రికార్డుని కలిగి ఉంది. మిగతా జట్లతో పోలిస్తే టీ20ల్లో న్యూజిలాండ్పై టీమిండియా పెద్దగా రాణించలేదు. ఇరుజట్ల మధ్య ఆడిన 11 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ 8 మ్యాచ్లు నెగ్గగా, టీమిండియా కేవలం 3 మ్యాచ్లు మాత్రమే గెలిచింది. అంతేకాదు టీ20ల్లో న్యూజిలాండ్పై భారత్ ఎప్పుడూ వరుస మ్యాచ్ల్లో గెలవలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన గత ఐదు మ్యాచ్ల్లో టీమిండియా కేవలం ఒక మ్యాచ్లో మాత్రమే విజయం సాధించింది. అది కూడా 2019లో సిరీస్ 1-2తో ఓడిపోయినప్పుడు.
న్యూజిలాండ్ జట్టుని వేధిస్తోన్న గాయాలు
మరోవైపు న్యూజిలాండ్ జట్టులోని ఆటగాళ్లను గాయాలు వేధిస్తున్నాయి. ట్రెంట్ బౌల్ట్, మాట్ హెన్రీ మరియు లాకీ ఫెర్గూసన్ లేకుండా ఆతిథ్య జట్టు బరిలోకి దిగుతోంది. ఇటీవలే సొంతగడ్డపై ఇంగ్లాండ్తో ఐదు టీ20ల సిరిస్ను 2-3తో చేజార్చుకోవడంతో భారత్తో సిరిస్ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మరోవైపు టీమిండియా సైతం శిఖర్ ధావన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్ వంటి స్టార్ ప్లేయర్లు లేకుండానే ఈ సుదీర్ఘ సిరిస్ ఆడనుంది. అయితే, వారి స్థానాన్ని భర్తీ చేసే అటగాళ్లు భారత జట్టులో ఉండటం విశేషం.