హైదరాబాద్: ఇటీవల కాలంలో టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఫీల్డింగ్ చేసేటప్పుడు కళ్ల జోడు పెట్టుకుని కనిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో బ్యాటింగ్, బౌలింగ్ చేస్తున్న సమయంలో కళ్ల జోడు పెట్టుకోని చాహల్ ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో మాత్రం కళ్ల జోడు పెట్టుకున్నాడు.
దీంతో చాహల్కు ఏమైంది అనే అనుమానం సగటు అభిమాని మదిలో మెదులుతోంది. కొందరు నెటిజన్లు మాత్రం స్టయిల్గా కనిపించేందుకు కళ్ల జోడు పెట్టుకుంటున్నాడంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పోస్టు చేస్తున్నారు. ఈ కామెంట్లపై హర్యానాలో ఉన్న చాహల్ తండ్రి వివరణ ఇచ్చాడు.
'చాహల్ సఫారీ పర్యటనకు వెళ్లే ముందు కంటికి సంబంధించిన వైద్యుడుని సంప్రదించాడు. అతడు అప్పుడప్పుడు కళ్ల జోడు ధరించాలని సూచించాడు. వైద్యుడి సూచన మేరకు చాహల్ కళ్లజోడు పెట్టుకుంటున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ చేసే సమయంలో కాకుండా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు పెట్టుకుంటున్నాడు' అని తెలిపాడు.
'చాహల్ కంటి చూపు వీక్గా లేదని, వైద్యుడి సూచన మేరకు కళ్లజోడు ధరిస్తున్నాడు. త్వరలో చాహల్ ఆదాయపు పన్ను శాఖ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇందులో భాగంగానే కంటి పరీక్షలు చేయించుకున్నాడు' అని చాహల్ తండ్రి చెప్పుకొచ్చాడు.
సఫారీ పర్యటన ముగిసిన తర్వాత చాహల్ ఐటీ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టనున్నాడని చెప్పాడు. గతంలో కూడా పలువురు క్రికెటర్లు కళ్ల జోడు ధరించిన సందర్భాలు అనేకం. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, వెస్టిండిస్కు చెందిన క్లైవ్ లాయిడ్, ఎడ్డీ బార్లో, వాల్టర్ హ్యాడ్లీ (రిచర్డ్ హ్యాడ్లీ తండ్రి), జెఫ్రీ బాయ్కాట్లు ఈ జాబితాలో ఉన్నారు.
న్యూజిలాండ్కు చెందిన మాజీ స్పిన్ బౌలర్ డానియేల్ వెటోరి తన క్రికెట్ కెరీర్ అసాంతం కళ్ల జోడు ధరించే క్రికెట్ ఆడాడు. ఇదిలా ఉంటే సఫారీ గడ్డపై భారత పర్యటన ఫిబ్రవరి 24తో ముగియనుంది. ఇరు జట్ల మధ్య బుధవారం సెంచూరియన్లోని సూపర్ స్పోర్ట్ పార్క్ వేదికగా రెండో టీ20 జరగనుంది.