లండన్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్ రద్దు చేసినట్లు భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) ప్రకటించగానే.. తన గుండె పగిలిందంటూ ఇంగ్లండ్ మాజీ ఆటగాడు, ప్రముఖ వ్యాఖ్యాత కెవిన్ పీటర్సన్ పేర్కొన్నాడు. సోమవారం కేకేఆర్ ఆటగాళ్లకు కరోనా పాజిటివ్గా తేలగా.. సీఎస్కే జట్టులో సిబ్బందితో పాటు బౌలింగ్ కోచ్కు కరోనా సోకినట్లు తేలింది. తాజాగా ఎస్ఆర్హెచ్ నుంచి సాహా, ఢిల్లీ నుంచి అమిత్ మిశ్రాలు కరోనా బారీన పడడంతో బీసీసీఐ ఐపీఎల్ నిర్వహణపై పునరాలోచించింది. మొదట తాత్కాలికంగా వాయిదా వేయాలని భావించినా.. ఆటగాళ్లకు కరోనా సోకే అవకాశాలు ఎక్కువే ఉండడంతో 14వ సీజన్ను రద్దు చేస్తున్నట్లుగా మంగళవారం నిర్ణయం తీసుకుంది.
బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. సరైన నిర్ణయం తీసుకుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో కెవిన్ పీటర్సన్ తన ట్విటర్ ద్వారా స్పందించాడు. 'భారత్ను ఇలా చూడడం బాధగా ఉంది. ప్రస్తుతం కరోనా విస్పోటనం ఆ దేశాన్ని భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఈ సమయంలో ఐపీఎల్ 2021ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడం.. నా గుండె పగిలేలా చేసింది. అయినా ఇలాంటి విపత్కర సమయంలో లీగ్ను రద్దు చేయడమే సరైన నిర్ణయం. బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నా' అని ట్వీట్ చేశాడు.
కరోనా మహమ్మారితో పోరాడుతున్న భారత దేశ ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఇంగ్లీష్ జట్టు మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ఒక సందేశాన్ని ఇచ్చాడు. 'భారత ప్రజలు ఈ విపత్తు నుంచి బయటపడాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నా. కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు దృడంగా ఉండాల్సిన సమయం ఇది. ఇలాంటి సమయంలో మీరు ఆత్మనిర్భరంతో ఉంటూ సంక్షోభాన్ని ఎదుర్కోవాలి. అందరూ మాస్కులు ధరించండి. శానిటైజ్ చేసుకోండి. అవసరం అయితేనే బయటికి వెళ్ళండి' అంటూ మరో ట్వీటులో కెవిన్ పేర్కొన్నాడు. భారత దేశం అంటే చాలా ఇష్టం అని కెవిన్ ఎన్నోసార్లు చెప్పిన విషయం తెలిసిందే.
India - it’s heartbreaking to see a country I love so much suffering! 😢
— Kevin Pietersen🦏 (@KP24) May 4, 2021
You WILL get through this!
You WILL be stronger coming out of this!
Your kindness & generosity NEVER goes unnoticed even during this crisis! 🙏🏽#IncredibleIndia ❤️
దక్షిణాఫ్రికా సంతతికి చెందిన కెవిన్ పీటర్సన్ ఇంగ్లండ్ తరఫున క్రికెట్ ఆడి సక్సెస్ అయ్యాడు. 104 టెస్టుల్లో 8181 పరుగులు చేయగా.. 136 వన్డేల్లో 4440 పరుగులు చేశాడు. ఇక 37 టీ20ల్లో 1176 రన్స్ చేశాడు. 2008లో పీటర్సన్ ఇంగ్లండ్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు. మూడు టెస్టులు, 10 వన్డేలలో జట్టుకు నాయకత్వం వహించాడు. 2013-14 యాషెస్ సిరీస్లో ఇంగ్లండ్ 0-5 తేడాతో ఆస్ట్రేలియా చేతిలో పరాజయం తర్వాత కెవిన్ పీటర్సన్ ఇంగ్లీష్ జట్టులో చోటు కోల్పోయాడు.