ప్రపంచకప్ ప్రభావం:
ప్రపంచకప్లో పాకిస్తాన్ చెత్త ప్రదర్శనతో సెమీస్కు చేరకుండానే నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే ప్రపంచకప్లో పాక్ కెప్టెన్, సీనియర్ ఆటగాళ్ల ప్రదర్శనపై విమర్శలు వచ్చాయి. దీంతో కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్తో పాటు సీనియర్ ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బందిపై వేటు వేయాలని అభిమానులతో పాటు పాక్ మాజీ క్రికెటర్లు డిమాండ్ చేశారు. పాక్ క్రికెట్ జట్టును ప్రక్షాళన చేయాల్సిన సమయం వచ్చిందని ఆ దేశ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ కూడా అన్నాడు.
మొదటి అడుగే బలంగా:
ఇటీవలే మికీ ఆర్థర్ను పాక్ ప్రధాన కోచ్ బాధ్యతల నుంచి తప్పించిన పీసీబీ.. మిస్బావుల్కు ఆ బాధ్యతలు అప్పగించింది. మరొకవైపు దేశవాళీ మ్యాచ్లకు కోచ్లుగా వ్యవహరించే వారికి చీఫ్ సెలక్టర్గా కూడా అతన్నే ఎంపిక చేసింది. దాంతో ఒకే సమయంలో మిస్బా రెండు కీలక బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. బాధ్యతలు చేపట్టిన మిస్బా మొదటి అడుగే బలంగా వేసాడు.
బిర్యానీ బంద్:
పాక్ ఆటగాళ్ల ఫిట్నెస్ విషయంలో పూర్తి దృష్టి సారించిన మిస్బా.. కొత్త సంప్రదాయానికి తెరలేపాడు. ఇక నుంచి పాక్ క్రికెటర్లు బిర్యానీ, స్పైసీ ఫుడ్, స్వీట్లకు దూరంగా ఉండాలనే నిబంధనను అమల్లోకి తెచ్చాడు. దీన్ని దేశవాళీ క్రికెట్ మ్యాచ్ల్లో కూడా అవలంభించాలని మిస్బా ఆదేశాలు జారీచేశాడని సమాచారం తెలుస్తోంది. నిబంధనలు ఉల్లంగిస్తే కఠిన చర్యలు ఉంటాయని కూడా హెచ్చరించాడు.
సీనియర్లపై వేటు:
శ్రీలంక, ఆస్ట్రేలియాలతో జరగబోయే వన్డే, టీ20 సిరీస్ల కోసం పీసీబీ ఓ ట్రైనింగ్ క్యాంప్ను ఏర్పాటు చేసింది. ఈ ట్రైనింగ్ క్యాంప్ కోసం పీసీబీ సోమవారం 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసింది. ఈ జాబితాలో పాక్ సీనియర్ ఆటగాళ్లు మహ్మద్ హఫీజ్, షోయాబ్ మాలిక్లను ఎంపిక చేయలేదు. దీంతో మిస్బా తన మార్క్ చూపించాడు. సర్ఫరాజ్ అహ్మద్ను మాత్రం కెప్టెన్గా కొనసాగించారు. ఇక బాబర్ అజమ్ వైస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు.