
హైదరాబాద్: హసీన్ జహాన్ ఫిర్యాదు మేరకు కోల్కతా పోలీసులు షమీపై పలు కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నాన్ బెయిలబుల్ సెక్షన్లు హత్యాయత్నం కింద 307, మహిళ పట్ల క్రూరత్వంగా ప్రవర్తించినందుకు గాను 498-ఏ, అత్యాచారం కింద 376 ప్రకారం కోర్టులో కేసు నడుస్తుండటంతో హసీన్ తాజా ఆరోపణతో మీడియా ముందుకొచ్చారు. భారత క్రికెటర్ మొహమ్మద్ షమీ భార్య హసీన్ జహాన్ తన జీవనాధారం కోసం రూ. 10 లక్షల భరణం ఇప్పించాలని అలీపూర్ కోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో పేర్కొంది.
తనకు, తన కుమార్తెకు కలిపి నెలకు రూ. 10 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఇందులో రూ. 7 లక్షలు కుటుంబ పోషణకు, రూ. 3 లక్షలు కుమార్తె ఖర్చులకు ఇవ్వాలని పేర్కొంది. గత నెలలో హసీన్ పోలీసు కేసు పెట్టినప్పటినుంచీ షమి ఆమెకు ఒక్క పైసా ఇవ్వలేదని జహాన్ లాయర్ తెలిపారు. అయితే ఆ తర్వాత రూ. లక్షకు అతడు చెక్ ఇచ్చినా అది బౌన్స్ అయిందని, దీంతో ఆమె వద్ద ఇప్పుడు చిల్లి గవ్వ లేదు' వెల్లడించారు.
ప్రస్తుతం ఆమె పెట్టిన గృహహింస కేసును విచారిస్తున్న ఈ కోర్టు... షమీతో పాటు అతని కుటుంబసభ్యులంతా 15 రోజుల్లోగా కోర్టులో స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. ఇదే కేసులో సహాయం కావాలంటూ హసీన్ జహాన్ పశ్చిమబంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని సైతం కలిశారు. ఓ పదిహేను నిమిషాలు సమావేశమైన ఆమెతో కేసు నిమిత్తం సహాయం చేస్తానని ఆమె అన్నారని తెలిపింది. అయితే.. ఈ విషయంపై మమతా బెనర్జీ పెద్దగా స్పందించలేదు. ఆమె ఫిర్యాదు చేసిన కేసులో షమీ, అతని తల్లి, సోదరుడు, సోదరి, వదిన ఉన్నారు.
కొద్ది రోజుల క్రితం షమీ, హసీన్ జహాన్ పెళ్లి రోజు కావడంతో షమీ తన భార్య పేరును ప్రస్తావిస్తూ.. ఐ మిస్ యూ జహాన్ అని ట్విట్టర్ ద్వారా ఓ కేకును పోస్టు చేయడం గమనార్హం. ప్రస్తుతం జరుగుతోన్న ఐపీఎల్ 11వ సీజన్లో షమీ ఢిల్లీ డేర్డెవిల్స్ తరపున ఆడుతున్నాడు. జనవరి నెలలో జరిగిన వేలంలో ఢిల్లీ జట్టు అతణ్ని రూ.3కోట్లకు కొనుగోలు చేసింది. సీజన్ ఆరంభం నుంచి జరిగిన రెండు మ్యాచ్లలోనూ ఓడిపోవడంతో ప్రస్తుతానికి ఆ జట్టు లీగ్ పట్టికలో ఆఖరి స్థానంలో ఉంది.