రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యం లేదు:
తాజాగా హర్షా భోగ్లే 'క్రిక్బజ్'తో మాట్లాడుతూ... 'ధోనీ ఏం ఆలోచిస్తున్నాడో తెలుసుకోవడం అసాధ్యం. మహీ నీడలు కూడా అతను ఏమి ఆలోచిస్తున్నాడో చెప్పలేవు. ఏ విషయమైనా ధోనీ తన మనసులోనే దాచుకుంటాడు. అతడు కెప్టెన్సీని వదులుకున్నప్పుడు, టెస్ట్ క్రికెట్ నుండి తప్పుకున్నపుడు ఎలాంటి ఆర్భాటాలు చేయలేదు. అదే విధంగా ధోనీ తన రిటైర్మెంట్ ప్రకటించినా ఆశ్చర్యం లేదు. ఏదో ఒకరోజు మీరు ఇదే చూస్తారు. టీ20 ప్రపంచకప్ వరకు అతడు వేచి చూస్తాడనుకోవట్లేదని నేను నమ్ముతున్నా' అని అన్నాడు.
ధోనీ కెరీర్ ముగిసినట్లే:
టీ20 ప్రపంచకప్ కోసం ధోనీని జట్టులోకి తీసుకోవాలని జట్టు మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తనకు అనిపించడం లేదని హర్షా భోగ్లే అన్నాడు. ఒకవేళ ఐపీఎల్ జరిగి ఉంటే పరిస్థితి వేరుగా ఉండేదని, ప్రస్తుత పరిస్థితుల్లో ధోనీ కెరీర్ అయిపోయినట్లేనని చెప్పాడు. ధోనీ తన ఐపీఎల్ ఫ్రాంచైజ్ చెన్నై సూపర్ కింగ్స్ కోసం ఇంకా ఆడాలని కోరుకుంటున్నట్లు భోగ్లే తెలిపాడు. 'నేను ఇప్పటికీ నమ్ముతున్నా.. ధోనీ చెన్నై జట్టు కోసం ఆడాలని కోరుకుంటున్నాడు. నేను ఈ విషయాన్ని గత సంవత్సరం ఐపీఎల్ ముగిసే సమయంలో తెలుసుకున్నా' అని చెప్పుకొచ్చాడు.
2019 ప్రపంచకప్ నుంచి విరామం:
గతేడాది 2019 వన్డే ప్రపంచకప్ ముగిసిన అనంతరం ధోనీ జాతీయ జట్టు దూరంగా ఉంటున్నాడు. కొంతకాలం భారత సైన్యంలో పనిచేసిన ధోనీ.. అనంతరం ప్రైవేటు కార్యక్రమాలకే పరిమితం అయ్యాడు. ఐపీఎల్-13లో సత్తా చాటితే, తనను తిరిగి జాతీయ జట్టులోకి ఎంపిక చేస్తామని జట్టు మేనేజ్మెంట్ అప్పట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే కరోనా వైరస్ కారణంగా క్రికెట్ కార్యకలాపాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో, స్పష్టంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ధోనీకి దారులు మూసుకు పోయినట్లే అని పలువురు విశ్లేషకులు భావిస్తున్నారు.
అసాధ్యమైతే కాదు:
మరోవైపు.. ప్రపంచకప్ తర్వాత నుంచి క్రికెట్కు దూరంగా ఉంటున్న ధోనీని మరోసారి మైదానంలో చూడగలమా అని ఎదురుచూస్తున్న అభిమానులకు అతడి చిన్ననాటి కోచ్ కేశవ్ రంజన్ ఊరటనిచ్చే మాటలు చెప్పాడు. 'ఈ ఏడాది ఐపీఎల్ జరిగేలా లేదు. ఐపీఎల్లో ఆడకుండా జట్టులో ధోనీకి చోటు దక్కడం కష్టమే అయినా.. అసాధ్యమైతే కాదు. నా అంచనా ప్రకారం టీ20 ప్రపంచకప్ జట్టులో ధోనీ ఉంటాడు' అని కేశవ్ చెప్పుకొచ్చాడు.