
హైదరాబాద్: టీమిండియా ఆల్రౌండర్ హార్ధిక్ పాండ్యా ఏదో సరదాగా మాట్లాడిన మాటలకి ఇంత రాద్ధాంతం చేయడం తగదని అతడి తండ్రి హిమాన్షు పాండ్యా చెప్పుకొచ్చారు. కరణ్ జోహార్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న 'కాఫీ విత్ కరణ్' షోకి ఇటీవల హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ వెళ్లారు. ఈ టాక్ షోలో కేఎల్ రాహుల్ ఆచితూచి బదులిచ్చినప్పటికీ పాండ్య మాత్రం నోటికి ఏదొస్తే అది మాట్లాడాడు.
ముఖ్యంగా కరణ్ జోహార్ హార్ధిక్ పాండ్యా లవ్స్టోరీ గురించి అడగ్గా తాను ఎంత మందితో శృంగారంలో పాల్గొన్నది, పార్టీల్లో అమ్మాయిల్ని తాను చూసే విధానంపై అభ్యంతరకరంగా మాట్లాడాడు. మరోవైపు కేఎల్ రాహుల్ కూడా తన జేబులో కండోమ్ ప్యాకెట్ గురించి వివరిస్తూ వివాదాస్పదంగా చెప్పుకొచ్చాడు.
ఈ టాక్ షో ఇటీవల ప్రసారంకాగా పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. భారత క్రికెట్ జట్టుకు ఆడుతూ హుందాగా వ్యవహరించాల్సిన ఇద్దరు క్రికెటర్లు ఇలా మాట్లాడటంపై సోషల్ మీడియాలో అభిమానులు మండిపడుతున్నారు. దీంతో తన వ్యాఖ్యలపై హార్దిక్ పాండ్యా ఇప్పటికే ట్విటర్ ద్వారా క్షమాపణ సైతం కోరాడు.
అయినా సరే బీసీసీఐ ఈ ఇద్దరిపై చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో పాండ్యా తండ్రి హిమాన్షు పాండ్యా మాట్లాడుతూ "హార్దిక్ పాండ్య కామెంట్స్ని ప్రేక్షకులు ఎందుకు ఇంత సీరియస్గా తీసుకుంటున్నారో? నాకు అర్థం కావడం లేదు. అదొక ఎంటర్టైన్మెంట్ షో.. అందుకే, ఫాండ్యా సరదాగా ఆ వ్యాఖ్యలు చేశాడు" అని అన్నాడు.
"అక్కడ అభిమానుల్ని అలరించాలనే ఉద్దేశంతో మాత్రమే హార్దిక్ పాండ్యా అలా మాట్లాడాడు. ఆ వ్యాఖ్యలను ఎవరూ సీరియస్ లేదా తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు. అతను చాలా అమాయకుడు. అదేవిధంగా సరదా మనిషి" అని హిమాన్షు వెల్లడించాడు.
ఇదిలా ఉంటే 'కాఫీ విత్ కరణ్' టాక్ షోలో మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న వీరిద్దరిపై బీసీసీఐ సస్పెన్షన్ వేటు పడింది. దీంతో ప్రస్తుతం ఆసీస్ పర్యటనలో ఉన్న వీరిద్దరూ భారత్కు తిరుగు పయనం కానున్నారు. ఈ ఇద్దరిపై విచారణ పూర్తయ్యే వరకు సస్పెన్షన్ కొనసాగనుంది.
భారత్కు తిరిగొచ్చి వీరిద్దరూ విచారణను ఎదుర్కోనున్నారు. తొలుత ఈ ఇద్దరిపై రెండు వన్డేల నిషేధం విధించాలని భావించినప్పటికీ... చివరికు విచారణ పూర్తయ్యే వరకు సస్పెండ్ చేయాలని బీసీసీఐ నిర్ణయించింది. శనివారం సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరగనున్న తొలి వన్డే నుంచి కూడా ఈ ఇద్దరినీ జట్టు మేనేజ్మెంట్ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.
మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఈ ఇద్దరిపై విచారణకు ఆదేశించామని, అది పూర్తయ్యే వరకు సస్పెండ్ చేస్తున్నామని సీఓఏ చైర్మన్ వినోద్ రాయ్ వెల్లడించారు.