ఎప్పుడు క్రికెట్లో అడుగు పెడతారో!
అతడు బాధ్యతలు చేపట్టాక కోర్టు అంబుడ్స్మన్ను నియమిస్తుంది. నిషేధం కారణంగా ఇప్పటికే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్కు దూరమైన వీరిద్దరు మళ్లీ ఎప్పుడు క్రికెట్లో అడుగు పెడతారో చెప్పలేని పరిస్థితి నెలకొంది. బీసీసీఐ నియమావళి ప్రకారం ఆటగాళ్లపై క్రమశిక్షణా చర్యలు తీసుకునే తుది అధికారం బోర్డు నియమించిన అంబుడ్స్మన్కే ఉంది.
విచారణ అనంతరం
ఇద్దరు క్రికెటర్లపై విచారణ అనంతరం బీసీసీఐ సీఈఓ రాహుల్ జోహ్రి కూడా తన నివేదికను అంబుడ్స్మన్కే ఇవ్వాలి. లోధా కమిటీ సిఫారసుల అమలు, బీసీసీఐ ఎన్నికలు తదితర అంశాలతో పాటు పాండ్యా-రాహుల్ల అంశంపై కూడా సుప్రీం కోర్టులో గురువారం వాదనలు జరిగాయి. సీఓఏ తరుపున న్యాయవాదులు పరాగ్ త్రిపాఠి, సీయూ సింగ్ దీనికి హాజరయ్యారు.
అంబుడ్స్మన్ను నియమించాల్సిందిగా
సమస్యను పరిష్కరించేందుకు వెంటనే అంబుడ్స్మన్ను నియమించాల్సిందిగా వారు కోరారు. అయితే బీసీసీఐ గుర్తింపు ఉన్న ప్రభుత్వ సంస్థల తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా మాత్రం అంబుడ్స్మన్ను నియమించే అధికారం కేవలం బోర్డుకే ఉందని... అది ఎన్నికలు నిర్వహించి కార్యవర్గం ఏర్పడిన తర్వాత మాత్రమే సాధ్యమని వాదించారు.
కేసును వాయిదా వేసిన ద్విసభ్య బెంచ్
అనంతరం జస్టిస్ ఎస్ఏ బోబ్డె, ఏఎం సప్రే సభ్యులుగా గల ద్విసభ్య బెంచ్ మొత్తం కేసును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో పాటు అమికస్ క్యూరీ (కోర్టు సహాయకారి) బాధ్యతలు స్వీకరించిన తర్వాతే తదుపరి వాదనలు వింటామని ద్విసభ్య బెంచ్ తేల్చి చెప్పింది. అమికస్ క్యూరీ లేకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోమని సుప్రీం స్పష్టం చేసింది.
గందరగోళంలో పాండ్యా, రాహుల్ భవిష్యత్తు
దాంతో క్రికెటర్ల భవిష్యత్తు గందరగోళంలో పడింది. మరోవైపు సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ మాత్రం సాధ్యమైనంత త్వరగా ఈ వివాదంపై ఓ నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. చట్టపరమైన వివాదంగా మారితే నిర్ణయం తేలడానికి మరింత సమయం పడుతుందని, అది జట్టు ప్రయోజనాలు దెబ్బతీస్తుందన్నారు.
తొలుత రెండు వన్డేల నిషేధం!
తొలుత వారిద్దరిపై రెండు వన్డేల నిషేధం విధించాలని సీవోఏ ఛైర్మన్ వినోద్ రాయ్ భావించాడు. అయితే సీఓఏ సభ్యురాలు డయానా ఎడుల్జీ న్యాయ సలహా కోరడంతో విషయం కోర్టు వరకు వెళ్లింది. ఇప్పటికే ఆస్ట్రేలియా సిరీస్కు అందుబాటులో లేని హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్ త్వరలో న్యూజిలాండ్ సిరీస్కు అందుబాటులో ఉంటారా? లేదా అన్నది సందిగ్దంలో పడింది.
కోర్టు వరకు లాగిన డయానా ఎడుల్జీ
"నిజానికి వినోద్ రాయ్ సూచన మేరకు 2 మ్యాచ్ల నిషేధంతో పని అయిపోయేది. కానీ దానికి ఒప్పుకోని డయానా ఎడుల్జీ లీగల్ టీమ్ సూచన అడగడం, వారు అంబుడ్స్మన్ తప్పనిసరి అని చెప్పడంతో విషయం కోర్టు దాకా వెళ్లిపోయింది. ఇప్పుడు ఎవరూ ఏమీ చేయడానికి లేదు. క్రికెటర్ల పరిస్థితి ఏమిటో అర్థం కావడం లేదు" అని బీసీసీఐ సీనియర్ సభ్యుడొకరు చెప్పుకొచ్చారు.