బాక్సింగ్ డే టెస్టులో విహారి చెత్త రికార్డు
ఇది కూడా బాక్సింగ్ డే టెస్టు కావడం విశేషం. కాగా, గత రెండు టెస్టుల్లో ఓపెనర్లుగా బరిలోకి దిగిన కేఎల్ రాహుల్, మురళీ విజయ్లు ఘోరంగా విఫలం కావడంతో సెలక్టర్లు మూడో టెస్టు నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. దీంతో మూడో టెస్టులో ఓపెనర్లుగా హనుమ విహారి, మయాంక్ అగర్వాల్లకు ఓపెనర్లుగా అవకాశం వచ్చింది.
టాస్ గెలిచిన కోహ్లీ
కాగా, బుధవారం ప్రారంభమైన ఈ టెస్టులో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మయాంక్ అగర్వాల్, హనుమ విహారి ఓపెనర్లుగా వచ్చారు. ఆస్ట్రేలియా గడ్డపై 71 ఏళ్ల తర్వాత అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో ఆరంగేట్రం చేసిన తొలి భారత బ్యాట్స్మన్గా మయాంక్ చరిత్ర సృష్టించాడు. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే ఓపెనర్ హనుమ విహారి ఔటయ్యాడు. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ మాత్రం చక్కటి శుభారంభాన్ని ఇచ్చాడు.
ఆరోన్ ఫించ్కు క్యాచ్ ఇచ్చిన విహారి
వీరిద్దరూ తొలి వికెట్కు 40 పరుగులు జోడించారు. కమ్మిన్స్ బౌలింగ్లో హనుమ విహారి(8) స్లిప్లో ఆరోన్ ఫించ్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన పుజారాతో కలిసి రెండో వికెట్కు 79 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. స్పిన్నర్ నాథన్ లియాన్ వేసిన 36వ ఓవర్ ఆఖరి బంతిని ఫోర్ బాది 95 బంతుల్లో మయాంక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
అరంగేట్రం టెస్టులో మయాంక్ హాఫ్ సెంచరీ
తద్వారా ఆసీస్ గడ్డపై ఆరంగేట్ర టెస్టులోనే హాఫ్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాట్స్మన్గా మయాంక్ చరిత్ర సృష్టించాడు. జట్టు స్కోరు 123 పరుగుల వద్ద కమిన్స్ వేసిన షార్ట్పిచ్ బంతికి మయాంక్ అగర్వాల్ పెవిలియన్కు చేరాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీతో కలిసి నిలకడగా ఆడిన పుజారా 152 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్టు కెరీర్లో పుజారాకిది 21వ హాఫ్ సెంచరీ.
బాక్సింగ్ టెస్టులో తొలిరోజు భారత్ 215/2
కోహ్లీ-పుజారా జోడీని ఆసీస్ బౌలర్లు తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. మయాంక్తో కలిసి రెండో వికెట్కు 83 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన పుజారా.. కోహ్లీతో కలిసి మూడో వికెట్కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. దీంతో తొలిరోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 2 వికెట్లు కోల్పోయి 215 పరుగులు చేసింది. క్రీజులో పుజారా(68), విరాట్ కోహ్లీ (47) పరుగులతో క్రీజులో ఉన్నారు.