హైదరాబాద్: ఐపీఎల్ 11వ సీజన్ ఆరంభంలోనే చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ బ్యాట్స్మన్ కేదార్ జాదవ్ గాయం కారణంగా ఈ ఐపీఎల్ సీజన్కు పూర్తిగా దూరమయ్యాడు. ముంబైతో జరిగిన ఆరంభ మ్యాచ్లో కేదార్ జాదవ్ గాయం కారణంగా బ్యాటింగ్ కొనసాగించలేక రిటైర్డ్ హట్గా వెళ్లిన సంగతి తెలిసిందే.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్|ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్
ఈ మ్యాచ్లో 12వ ఓవర్లో జాదవ్ గాయపడ్డాడు. ఆ తర్వాత చివరి ఓవర్లో వచ్చి ఒక సిక్స్, ఒక ఫోర్ బాది చెన్నై జట్టుకు విజయాన్ని అందించాడు. టోర్నీలో భాగంగా తదుపరి మ్యాచ్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆదివారం చెన్నైకు చేరుకుంది.
ఈ నేపథ్యంలో తొడ కండరాలు గాయంతో బాధపడుతోన్న కేదార్ జాదవ్ని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు పలు స్కానింగ్లు నిర్వహించారు. అనంతరం వైద్యులు కేదార్ జాదవ్కి పూర్తిస్థాయిలో విశ్రాంతి కావాలని సూచించారు. దీంతో ఈ సీజన్లో జాదవ్ ఈ ఐపీఎల్కు పూర్తిగా దూరమయ్యాడు.
మిడిలార్డర్లో కీలక బ్యాట్స్మన్ అయిన కేదార్ జాదవ్ గాయంతో తప్పుకోవడం తమ జట్టుకు పెద్ద నష్టమని బ్యాటింగ్ కోచ్ మైకేల్ హసీ పేర్కొన్నాడు. ఈ ఏడాది జనవరిలో బెంగళూరు వేదికగా జరిగిన వేలంలో రూ. 7.8 కోట్లకు అతడిని చెన్నై సూపర్ కింగ్స్ దక్కించుకుంది.
రెండేళ్ల విరామం తర్వాత సొంతగడ్డపై చెన్నై జట్టు కోల్కతా నైట్ రైడర్స్తో తలపడుతుంది. అయితే జాదవ్ స్థానంలో ఎవరిని జట్టులోకి తీసుకుంటారనే విషయంపై చెన్నై వెల్లడించలేదు.