
హైదరాబాద్: సోమవారం ముంబైలో సియెట్ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. అంతర్జాతీయ క్రికెట్లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లకు ఈ కార్యక్రమంమలో అవార్డులు ప్రదానం చేశారు.
ఈ కార్యక్రమానికి యూనివర్స్ బాస్ క్రిస్గేల్తో పాటు టీమిండియా క్రికెటర్లు శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు సైతం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్రిస్ గేల్ టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్, రోహిత్ శర్మకు డ్యాన్స్ ఎలా చేయాలో కూడా చూపించాడు.
ఈ కార్యక్రమంలో శిఖర్ ధావన్ మీసం మెలేసి తొడకొట్టాడు. ఆ తర్వాత తనలా మీసం మెలేసి తొడకొట్టాలని క్రిస్ గేల్కు సవాల్ విసిరాడు. దీంతో గేల్ కూడా అచ్చం ధావన్లా మీసం మెలేసి తొడకొట్టాడు. ఈ సన్నివేశంపై రోహిత్ శర్మతో పాటు కార్యక్రమానికి హాజరైన పలువురు క్రికెటర్లు చిరునవ్వులు చిందించారు.
ఐపీఎల్ 11వ సీజన్లో క్రిస్ గేల్ తన అద్భుత బ్యాటింగ్తో అలరించిన సంగతి తెలిసిందే. టోర్నీ ఆరంభంలో విజయాలతో అదరగొట్టిన పంజాబ్ ఆ తరువాత అంతగా రాణించలేదు. దీంతో ప్లేఆఫ్కు చేరుకోలేకపోయింది. గత ఏడాది విజేతగా నిలిచిన ముంబై ఇండియన్స్ ఈ టోర్నీ ఆరంభం నుంచి అంతగా రాణించలేకపోయింది.
దీంతో ఆ జట్టుకు కూడా ప్లేఆఫ్లో చోటు దక్కలేదు. ఇందుకు సంబంధించిన వీడియోని హర్ష గోయెంకా ట్విటర్లో అభిమానులతో పంచుకున్నాడు. సియెట్ అవార్డుల కార్యక్రమంలో శిఖర్ ధావన్కు అంతర్జాతీయ బ్యాట్స్మన్ ఆఫ్ ది అవార్డు వచ్చింది.
ఇక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి వచ్చిన సియెట్ అంతర్జాతీయ క్రికెటర్ అవార్డును కోహ్లీ తరఫున రోహిత్ శర్మ అందుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్కు అంతర్జాతీయ బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్దు రాగా, ఆఫ్ఘనిస్థాన్ స్టార్ స్పిన్నర్ రషీద్ఖాన్కు టీ20 బౌలర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు, కొలిన్ మున్రోకు టీ20 బ్యాట్స్మన్ ఆఫ్ ద ఇయర్ అవార్డులను అందుకున్నారు.
గతేడాది జరిగిన మహిళల వన్డే వరల్డ్ కప్లో ఆస్ట్రేలియాపై సెమీఫైనల్లో సెంచరీ(171)తో భారత్ను ఫైనల్కు చేర్చిన హర్మన్ప్రీత్కౌర్కు ఔట్ స్టాండింగ్ ఇన్నింగ్స్ అవార్డు, మయాంక్ అగర్వాల్కు డొమెస్టిక్ ప్లేయర్ అవార్డు, అండర్-19 ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును శుభమన్ గిల్, క్రిస్ గేల్కు పాపులర్ చాయిస్ అవార్డులు దక్కాయి.
ఇక, టీమిండియా మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజనీర్ని లైప్ టైమ్ అచీవ్మెంట్తో సత్కరించారు. ఈ కార్యక్రమంలో భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్, గ్రేమ్ స్మిత్ పాల్గొన్నారు.