న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మళ్లీ నోరు పారేసుకున్నాడు. శ్రీలంక చెత్త బౌలింగ్ కారణంగానే కోహ్లీ సెంచరీ చేయగలిగాడని తెలుపుతూ.. అతన్ని తక్కువ చేసే ప్రయత్నం చేశాడు. వీలు చిక్కినప్పుడల్లా విరాట్కు వ్యతిరేకంగా ఏదో ఒక విమర్శ చేసే గంభీర్.. తాజాగా అదే రీతిలో మాట్లాడాడు.
శ్రీలంకతో తొలి వన్డేలో సెంచరీతో చెలరేగిన విరాట్ కోహ్లీ కొత్త ఏడాదిని ఘనంగా ప్రారంభించాడు. దాంతో కింగ్ కోహ్లీపై సర్వత్రా ప్రశంసలు జల్లు కురిస్తోంది. వన్డే ఫార్మాట్లో 45వ సెంచరీ బాదిన విరాట్.. సచిన్ టెండూల్కర్ 100 శతకాల రికార్డును అధిగమిస్తాడని మాజీ క్రికెటర్లు, అభిమానులు జోస్యం చెప్పారు.
అయితే భారత క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్తో విరాట్ కోహ్లీని పోల్చడం సరైంది కాదని గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. సచిన్ ఆడిన పరిస్థితులకు ఇప్పటికీ చాలా మార్పులు ఉన్నాయని తెలిపాడు. 'ఒకరి రికార్డులను మరొకరితో పోల్చడం సరైంది కాదు. వన్డే ఫార్మాట్లో సచిన్ టెండూల్కర్ 49 వన్డే సెంచరీల కంటే విరాట్ కోహ్లీ ఎక్కువ సెంచరీలు సాధించే అవకాశం ఉంది.
అయితే అప్పుడు, ఇప్పుడు నిబంధనలు చాలా మారిపోయాయి. గతంలో ఒకే కొత్త బంతిని తీసుకొనే అవకాశం ఉండేది. ఇప్పుడు రెండు బంతులు తీసుకొంటున్నారు. అలాగే సర్కిల్లో ఐదుగురు ఫీల్డర్లు ఉంటున్నారు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం అద్భుతమైన ఆటగాడు. అందులో ఎలాంటి సందేహం లేదు.'అని గంభీర్ తెలిపాడు.
అంతేగాక 'శ్రీలంక బౌలింగ్ మరీ ఆర్డినరీగా ఉంది. టీమిండియా టాప్-3 ఎంత ఈజీగా బ్యాటింగ్ చేశారో చూడండి. రోహిత్ - కోహ్లీలతో పాటు కొత్త కుర్రాడు శుభమన్ గిల్ కూడా చాలా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో లంక బౌలింగ్ నన్ను తీవ్రంగా నిరాశకు గురి చేసింది.'అని చెప్పుకొచ్చాడు.
ఇక విరాట్ కోహ్లీ తక్కువ చేస్తూ గంభీర్ చేసిన వ్యాఖ్యలపై అతని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కోహ్లీని ఎప్పుడూ ఏదో ఒకటి అనకుంటే గంభీర్కు పొద్దుపోదని, తన అసూయను ఇలా బయటపెడుతున్నాడని కామెంట్ చేస్తున్నారు. గంభీర్ వ్యాఖ్యలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని సూచిస్తున్నారు.