న్యూఢిల్లీ: శ్రీలంకతో వన్డే సిరీస్లో విరాట్ కోహ్లీ ఒక్కడికే మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఇవ్వడాన్ని టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ తప్పుబట్టాడు. బౌలింగ్లో సత్తా చాటిన మహమ్మద్ సిరాజ్ను కలిపి సంయుక్తంగా ఈ అవార్డును అందజేయాల్సిందని అభిప్రాయపడ్డాడు. 'విరాట్ కోహ్లీ ఒక్కడికే ఈ అవార్డును ఇవ్వడం కరెక్ట్ కాదేమో. విరాట్ కోహ్లీతో మహమ్మద్ సిరాజ్ సమాంగా రాణించాడని నేను అనుకుంటున్నాను. ఇద్దరికి కలిపి మ్యాన్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందజేయాలి.
అతను ఎంతో అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. పెద్ద సెంచరీలు చేసే బ్యాటర్లవైపే మనం మొగ్గుచూపుతామని తెలుసు. అయితే ఈ సిరీస్ మొత్తంలో సిరాజ్ బంతితో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చాడు' అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
మహమ్మద్ సిరాజ్ ఈ సిరీస్లో మొత్తం 9 వికెట్లు పడగొట్టి టాప్ వికెట్ టేకర్గా నిలిచిన విషయం తెలిసిందే. ఆఖరి వన్డేలో 4 వికెట్లు పడగొట్టిన సిరాజ్.. తృటిలో ఐదు వికెట్ల ఘనతను మిస్సయ్యాడు. ఇక ఈ సిరీస్లో విరాట్ కోహ్లీ సెంచరీల మోత మోగించిన విషయం తెలిసిందే.
మూడు ఇన్నింగ్స్లో రెండు సెంచరీలు బాది.. ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. శ్రీలంకతో మూడు మ్యాచ్ల్లో 141.50 సగటుతో 283 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్'గా నిలిచాడు. కొత్త ఏడాదిలో తొలి వన్డే సిరీస్ను నెగ్గిన టీమిండియా.. అదే ఉత్సాహాన్ని న్యూజిలాండ్పై కొనసాగించాలని చూస్తోంది. కివీస్తో తొలి వన్డే బుధవారం హైదరాబాద్ వేదికగా జరగనుంది.
రోహిత్ తను ఆడిన చివరి 50 అంతర్జాతీయ ఇన్నింగ్స్లలో ఒక్కటంటే ఒక్క సెంచరీ కూడా చేయలేదు. ఇది చూసిన గంభీర్ ఆశ్చర్యపోయాడు. అదే సమయంలో కోహ్లీపై వచ్చిన విమర్శలను గుర్తుచేస్తూ.. రోహిత్ను కూడా కోహ్లీ స్థానంలో ఉంచాలని, అతన్ని కూడా విమర్శించాలని స్పష్టం చేశాడు.
రోహిత్ ఇన్ని ఇన్నింగ్స్లలో సెంచరీ చేయలేదనే విషయమే తాను గమనించలేదన్న గంభీర్.. వీళ్లిద్దరూ భారీ స్కోర్లు చేయగలిగే ఆటగాళ్లేననే విషయం మర్చిపోవద్దన్నాడు. అయితే ఆరంభాన్ని సెంచరీగా మలచడంలో విఫలం అవుతూ వచ్చిన కోహ్లీ మళ్లీ గాడిలో పడ్డాడని, కానీ రోహిత్ ఇంకా అక్కడి వరకు రాలేదని చెప్పాడు. వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే వీళ్లిద్దరూ రాణించడం చాలా ముఖ్యం అని చెప్పాడు.