ఢిల్లీ: టీమిండియా మేనేజ్మెంట్కు యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్పై ఉన్న నమ్మకంతోనే అన్ని ఫార్మాట్లలో అవకాశాలు ఇస్తుంది. ఆ నమ్మకాన్ని పంత్ కాపాడుకోవాలి. అంటే.. అతడు పరుగులు చేయాలి అని బీజేపీ ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ పేర్కొన్నాడు. పంత్ మరింత నిలకడైన ప్రదర్శన చేయాలని సూచించాడు. సుదీర్ఘ ఇన్నింగ్స్లు ఆడడంపై దృష్టి సారించాలన్నాడు.
విశాఖలో రెండో వన్డే.. హాట్ కేకుల్లా మ్యాచ్ టిక్కెట్లు!!
వెస్టిండీస్తో ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో పంత్ 71 (69 బంతుల్లో; 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీ చేశాడు. గతేడాది అంతర్జాతీయ క్రికెట్లోకి అరంగేట్రం చేసిన పంత్.. ఎట్టకేలకు వన్డే ఫార్మాట్లో తొలి హాఫ్ సెంచరీ సాధించాడు. గత కొంతకాలంగా పేలవమైన ఫామ్తో విమర్శలు ఎదుర్కొంటున్న ఈ యువ ఆటగాడు చివరకు సత్తాచాటాడు. ఈ ప్రదర్శనపై తాజాగా గంభీర్ స్పందించాడు. 'ఎంఎస్ ధోనీ జట్టు అవసరాలను బట్టి ఎంత నిలకడగా ఆడుతాడో అదే తరహాలో రాణించడానికి పంత్ ప్రయత్నించాలి. 60 నుంచి 70 పరుగుల స్కోరును సెంచరీగా మలచుకోవాలి' అని సూచించాడు.
'టీమిండియా మేనేజ్మెంట్కు పంత్పై ఉన్న నమ్మకంతోనే అన్ని ఫార్మాట్లలో అవకాశాలు ఇస్తుంది. ఇటీవలి టెస్టు తుది జట్టులో పంత్ ఆడనప్పటికీ.. కనీసం రిజర్వ్ ఆటగాడిగానైనా కొనసాగిస్తుంది. అందుకు కారణం అతనిపై ఉన్న నమ్మకమే. పంత్ దాన్ని కాపాడుకోవాలి. భారీ సెంచరీలు చేయనవసరం లేదు. ఎక్కువ సమయం క్రీజ్లో ఉండటానికి యత్నించాలి. గత ఇన్నింగ్స్ బాగా ఆడాడు. అయితే ఇంకా క్రీజులో ఉండాల్సింది' అని గంభీర్ పేర్కొన్నాడు. ఎంఎస్ ధోనీ వారసుడిగా పంత్ జట్టులోకి వచ్చిన విషయం తెలిసిందే.
చెన్నై వన్డేలో మొదటగా బ్యాటింగ్ చేసిన టీమిండియా ఆరంభంలోనే ఓపెనర్ కేఎల్ రాహుల్, కెప్టెన్ విరాట్ కోహ్లీల వికెట్లను చేజార్చుకుంది. ఇక రోహిత్ శర్మ ఔట్ అనంతరం రిషబ్ పంత్- శ్రేయాస్ అయ్యర్ల జోడి ఆకట్టుకుంది. ఈ ఇద్దరు ఆచితూచి ఆడుతూ 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే అర్ధ సెంచరీల అనంతరం ధాటిగా ఆడే క్రమంలో పెవిలియన్ చేరారు. చివరలో కేదార్ జాదవ్ రాణించడంతో టీమిండియా 288 పరుగుల లక్ష్యాన్ని విండీస్ ముందుంచుంది. అయితే హెట్మెయిర్ (139), హోప్ (102)లు సెంచరీలతో రాణించడంతో భారత్కు ఓటమి తప్పలేదు.