ఢిల్లీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ఆడే ఆటగాళ్లెవరూ కరోనా వైరస్కు భయపడరని టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. ఏ ఒక్కరి కోసమో టోర్నీ మొత్తాన్ని రద్దు చేయలేరని, కచ్చితమైన నిబంధనలు పాటించడం ఎంతో ముఖ్యమన్నారు. భారత్లో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఐపీఎల్ 13వ సీజన్ను యూఏఈకి తరలించిన విషయం తెలిసిందే. అయితే యూఏఈలో కూడా పలువురు ఆటగాళ్లు వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే.
తాజాగా గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ... 'కరోనా వైరస్కు సంబంధించి క్రికెటర్లు ఎవరూ భయపడరని అనుకుంటున్నా. అయితే ప్రతీ ఒక్కరూ బీసీసీఐ, ఐపీఎల్ నిబంధనలను తప్పకుండా పాటించి బయో సెక్యూర్ వాతావరణంలో ఉండాలి. అందరూ ఎంతో జాగ్రత్తగా ఉండాలి. ఏ ఒక్కరి కోసమో టోర్నీ మొత్తాన్ని రద్దు చేయలేరు. కాబట్టి కచ్చితమైన నిబంధనలు పాటించడం ఎంతో ముఖ్యం. వ్యక్తిగత జాగ్రత్తే అందరికి శ్రేయస్కరం' అని అన్నాడు.
ఈ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధిస్తుందా అని ప్రశ్నించగా.. ఈ టోర్నీలో ఏ జట్టు దేన్నైనా ఓడించగలదని, అన్నిటికంటే ముఖ్యమైంది టోర్నీని ఎలా ఆరంభించాలనేదే అని బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ పేర్కొన్నాడు. మరోవైపు టీమిండియా ఆటగాళ్లు చాలా కాలంగా ఆటకు దూరమయ్యారని, ఇలాంటి పరిస్థితుల్లో వారు బాగా ఆడుతున్నారా లేక ఫామ్ కోల్పోయారా అనే విషయాలు సీజన్ ఆరంభమయ్యాకే తెలుస్తుందన్నాడు.
యువరాజ్ సింగ్ పంజాబ్ తరఫున టీ20 క్రికెట్ ఆడటానికి తన రిటైర్మంట్ను వెనక్కి తీసుకుంటున్నట్లు వచ్చిన వార్తలపై గౌతమ్ గంభీర్ స్పందించారు. 'యువరాజ్ పంజాబ్ తరపున ఆడాలనుకుంటే ఆడొచ్చు. మీరు క్రికెట్ను ప్రారంభించమని, ముగించమని ఏ ఒక్కరూ బలవంతం చేయరు. అతడు పదవీ విరమణ నుంచి తిరిగి వచ్చి ప్రేరణతో ఆడాలనుకుంటే కచ్చితంగా స్వాగతించబడతాడు' అని పేర్కొన్నాడు. 40 టెస్టులు, 304 వన్డేలు, 58 టీ20లు ఆడిన యువరాజ్ గతేడాది రిటైర్మెంట్ ప్రకటించాడు. మూడు ఫార్మాట్లలో వరుసగా 1900, 8701, 1177 పరుగులు సాధించాడు.
CSK: బీసీసీఐ క్లియరెన్స్.. నేటి నుంచే దీపక్ చహర్ ప్రాక్టీస్!!