బంక్ బెడ్లు నుంచి ఫైవ్ స్టార్ హోటళ్ల వరకు: పాత రోజుల్ని గుర్తు చేసుకున్న జులన్

హైదరాబాద్: బంక్ బెడ్లు, అన్రిజర్వ్డ్ రైలు టికెట్ల నుంచి ఫైవ్ స్టార్ హోటల్లో బస, బిజినెస్ తరగతిలో ప్రయాణం వరకు భారత మహిళల క్రికెట్లో అనేక మార్పులు వచ్చాయని పేసర్ జులన్ గోస్వామి అన్నారు. ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్కు సర్వం సిద్ధమైంది.
టోర్నీలో భాగంగా శుక్రవారం(నవంబర్ 9) భారత్-న్యూజిలాండ్ మహిళా జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ సందర్భంగా మహిళల క్రికెట్లో సరైన సౌకర్యాలు లేని పాత రోజులను జులన్ గోస్వామి గుర్తు చేసుకున్నారు. క్రికెట్ ఆడేందుకు తాము పడ్డ ఇబ్బందులను సైతం జులన్ గోస్వామి ఈ సందర్భంగా వివరించారు.
"నా తొలి ప్రపంచకప్ (2005) సందర్భంగా బంక్ బెడ్లపై పడుకోవడం నాకింకా గుర్తుంది. దేశవాళీ మ్యాచ్ల కోసమైతే మేం తరచుగా రిజర్వేషన్ లేని రైళ్లలో ప్రయాణించేవాళ్లం. తేలికపాటి గాయాలయ్యే మైదానాల్లో ఆడేవాళ్లం. జూనియర్ టోర్నీలప్పుడైతే డార్మిటరీలే దిక్కు. నేలపై చాపలేసుకుని పడుకోవాల్సివచ్చేది" అని జులన్ అన్నారు.

నవంబరు 9 నుంచి 18 వరకు మహిళల వరల్డ్ టీ20
ఈ ఫార్మాట్లో భారత్ ఇప్పటివరకు మెరుగ్గా ఆడింది లేదు. దీంతో ఈసారి టోర్నీలో మెరుగైన ప్రదర్శన చేయాలని హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత మహిళల జట్టు భావిస్తోంది. టోర్నీలో భాగంగా నవంబరు 9 నుంచి 18 వరకు గయానా, సెయింట్ లూసియా ఆతిథ్యమిస్తాయి. సెమీఫైనల్స్, ఫైనల్ 22, 24న అంటిగాలో జరుగుతాయి.

2009లో జరిగిన తొలి మహిళల టీ20 వరల్డ్ కప్ను
2009లో జరిగిన తొలి మహిళల టీ20 వరల్డ్ కప్ను చార్లెట్ ఎడ్వర్డ్స్ నాయకత్వంలోని ఇంగ్లాండ్ జట్టు సొంతం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన మూడు టోర్నీల్లోనూ ఆస్ట్రేలియా జట్టు హ్యాట్రిక్ టైటిల్స్తో చరిత్ర సృష్టించింది. 2010, 2012, 2014 టోర్నీల్లో ఆస్ట్రేలియా జట్టు వరుసగా మూడు టైటిల్స్ సాధించి అరుదైన ఘనత సాధించింది.

2016లో సంచలన ప్రదర్శన చేసిన వెస్టిండిస్ జట్టు
2016లో భారత్ వేదికగా జరిగిన టోర్నీలో వెస్టిండిస్ జట్టు సంచలన ప్రదర్శన చేసింది. ఫైనల్లో ఆస్ట్రేలియానే ఓడించి తొలి సారిగా ఈ ఫార్మాట్లో ఛాంపియన్గా అవతరించింది. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొంటున్నాయి. "2009 నుంచి జరిగిన అన్ని మహిళల టీ20 ప్రపంచకప్పుల్లోనూ నేను ఆడా. అవన్నీ పురుషుల టోర్నీతో పాటే జరిగాయి. ప్రేక్షకులు చూశారు. బాగానే ప్రచారం జరిగింది. కానీ, పురుషుల టోర్నీలతో పాటు జరగడం వల్ల మహిళల టోర్నీలు మరుగున పడిపోయాయన్నది నా అభిప్రాయం" అని ఐసీసీ వెబ్సైట్కు రాసిన కాలమ్లో జులన్ పేర్కొన్నారు.

దేశవాళీ మ్యాచ్లకు రైళ్లకు బదులు విమానంలో
ఎప్పుడైతే బీసీసీఐ పరిధిలోకి వెళ్లిందో భారత మహిళల క్రికెట్ పూర్తిగా మారిపోయిందని అన్నారు. "మహిళల క్రికెట్ బీసీసీఐ ఆధ్వర్యంలోకి వెళ్లాక, దేశవాళీ మ్యాచ్లకు కూడా రైళ్లకు బదులు విమానంలో పంపించడం మొదలైంది. ఇంతకుముందు రైళ్లలో కూర్చునే స్థలం కోసం ఇతర ప్రయాణీకులతో కొట్లాడేవాళ్లం. ఇప్పుడు విమానంలో కిటికీ సీటు కోసం ఒకరితో ఒకరం పోట్లాడుకుంటున్నాం" అని జులన్ వెల్లడించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications