హైదరాబాద్: మైదానం బయట కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్లతో ఉన్న స్నేహబంధం జట్టు ఎంపికలో తన బాధను తొలగించిందని టీమిండియా ఓపెనర్ మురళీ విజయ్ అన్నారు. గాయం తర్వాత జట్టులోకి వచ్చిన మురళీ విజయ్ శ్రీలంకతో కొల్కతా వేదికగా జరిగిన తొలి టెస్టుకు గాను బెంచీకి పరిమితమైన సంగతి తెలిసిందే.
అయితే రెండో టెస్టుకు తన సోదరి వివాహం కారణంగా ధావన్ దూరం కావడం... తద్వారా తుది జట్టులో చోటు దక్కించుకున్న మురళీ విజయ్ సెంచరీతో అలరించడం తెలిసిందే. మూడో టెస్టు నేపథ్యంలో తుది జట్టులో ఎంపిక కాకపోవడంతో భావోద్వేగాన్ని ఎలా నియంత్రించారనే ప్రశ్నకు విజయ్ తనదైన శైలిలో స్పందించాడు.
'మేం ముగ్గురం (ధావన్, రాహుల్, విజయ్) మైదానం బయట మంచి మిత్రులం. రెగ్యులర్గా ఆడుతున్న ఓపెనర్కు జట్టులో చోటు దక్కకపోతే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. మా ముగ్గురికీ బయట మంచి స్నేహబంధం ఉండటం నాకు కలిసొచ్చింది. భవిష్యత్తులో సుదీర్ఘ సిరీస్లప్పుడు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. జట్టు ఎంపిక తర్వాత మేం ఒకరితో మరొకరం సరదాగా మాట్లాడుకుంటాం. అది మాకు సాయపడుతుంది' అని అన్నాడు.
మూడో టెస్టుకు తుది జట్టులో ఎవరు ఉంటారో తనకు తెలియదని మురళీ విజయ్ తెలిపాడు. 'టీమ్ మేనేజ్మెంట్ నిర్ణయాలను అనుసరించి మేం ఆడతాం. ఎంపిక పూర్తిగా వారి చేతుల్లోనే ఉంటుంది. జట్టు కోసం మేం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాం. పరిస్థితులను బట్టి ఆటగాళ్లు ఒకరితో మరొకరు చర్చించుకోవాలి. విదేశీ పర్యటనల్లో ఇదేంతో కీలకం. అందుకే ఇప్పటి నుంచే ప్రాక్టీస్ చేస్తున్నా' అని మురళీ విజయ్ అన్నాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.