డిప్రెషన్తో నరకం చూశా:
'ది ఇండియన్ ఎక్స్ప్రెస్'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... 'కెరీర్ ఆరంభంలో నా బౌలింగ్ను అందరూ మెచ్చుకున్నారు. ఆ సమయంలో నాకు చాలా ఆనందం వేసింది. ఇక ఇంగ్లండ్ సిరీస్ అనంతరం టెస్టు క్రికెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నా. కానీ.. అనూహ్యంగా జట్టు నుంచి తప్పించారు. మళ్లీ అవకాశాలు ఇవ్వలేదు. దీనికి తోడు ఐపీఎల్ కాంట్రాక్ట్ కూడా ముగిసిపోవడంతో పూర్తిగా నిరాశ చెందా. డిప్రెషన్తో నరకం చూశా. ఒకవైపు మానసిక ఆరోగ్య సమస్యలు, మరోవైపు ఒంటరితనంను అనుభవించా' అని తెలిపాడు.
ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా:
'డిప్రెషన్ను భారత్లో ఎవరూ అర్థం చేసుకోరని తెలిసి ఎవరికీ చెప్పలేదు. ఒక్కోసారి ఏం చేయాలో అర్ధం కాకపోయేది. విసుగుచెంది ఇక జీవితాన్ని ముగిద్దాం అనుకొని మీరట్ నుంచి హరిద్వార్కు నా లైసెన్డ్స్ రివాల్వర్తో బయలుదేరా. హరిద్వార్ జాతీయ రహదారిపై కారును పక్కకు ఆపి రివాల్వర్తో షూట్ చేసుకుందామనుకున్నా. ఆ సమయంలో నవ్వుతున్న నా పిల్లల ఫోటో చూశాక ధైర్యం రాలేదు. నేను చనిపోతే వారు అనాథలవుతారని నా మనసులో అనిపించింది. నా కారణంగా అమాయకులైన వారు రోడ్డుపై పడతారు. ఇవన్నీ ఆలోచించి నా నిర్ణయం మార్చుకున్నా' అని ప్రవీణ్ కుమార్ తెలిపాడు.
క్రికెటర్లకు ఆర్థికంగా సహాయం చేస్తా:
పుట్టినప్పటినుండి నేను అందరితో బాగానే ఉండేవాడిని. రోడ్డు మీద నడుస్తున్న ఎవరికైనా హలో చెప్పేవాడిని. కానీ ఇప్పుడు అలా లేదు. ఎటువంటి కమ్యూనికేషన్ లేదు. నేను ఎవరితోనైనా మాట్లాడవలసి వస్తే.. నా రెస్టారెంట్కు వెళ్లాలి. నేను బాగా తాగుతానని ప్రచారం చేసారు. దయచేసి ఎవరు తాగనివారో నాకు చెప్పండి. నేను చేసిన మంచి పనుల గురించి ఎవరూ మాట్లాడరు. నేను చిన్న పిల్లలకు స్పాన్సర్ చేసా, 10 మంది అమ్మాయిల వివాహాలకు ఏర్పాట్లు చేశా. క్రికెటర్లకు ఆర్థికంగా సహాయం చేస్తాను. ఇవేవి బయటకు రావు. ఏదేమైనా ఇప్పుడంతా బాగానే ఉంది. నేను కూడా బాగానే ఉన్నాను. ప్రస్తుతం క్రికెట్ కోచింగ్ వైపు అడుగులు వేస్తున్నా' అని ప్రవీణ్ కుమార్ చెప్పుకొచ్చాడు.
మీరట్లో కేసు:
గతేడాది డిసెంబర్ నెలలో ఓ స్కూల్ అబ్బాయిని చితకబాదినందుకు ప్రవీణ్ కుమార్పై మీరట్లో కేసు నమోదు అయింది. అయితే తాను తప్పతాగి పక్కంటి వారిపై దాడి చేసినట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదన్నాడు. ఎప్పుడూ చీమకు కూడా హాని కల్గించనని, అలాంటిది ఒక అబ్బాయిపై ఎలా దాడి చేస్తా అని ప్రశ్నించాడు. ఫిర్యాదు చేయడం తనను తీవ్రంగా బాధించి అని ప్రవీణ్ కుమార్ అన్నాడు.
2018లో రిటైర్మెంట్:
ప్రవీణ్ కుమార్ 2007 నవంబర్లో పాకిస్తాన్తో జరిగిన వన్డే మ్యాచ్లో అరంగేట్రం చేశాడు. మార్చి 30, 2012లో దక్షిణాఫ్రికాపై చివరి మ్యాచ్ ఆడాడు. టీమిండియా తరుపున 6 టెస్టులు, 68 వన్డేలు, 10 టీ20లు ఆడాడు. అన్ని ఫార్మాట్లలో కలిపి 112 వికెట్లు తీశాడు. సుదీర్ఘకాలం సెలెక్టర్లు పట్టించుకోకపోవడంతో చివరగా 2018 అక్టోబర్లో రిటైర్మెంట్ ప్రకటించాడు.