
హైదరాబాద్: భారత జట్టు తరుపున ఆడాలన్న నా కల నిజమైందని తమిళనాడుకు చెందిన యువ ఆటగాడు వాషింగ్టన్ సుందర్ పేర్కొన్నాడు. డిసెంబర్ 20 నుంచి శ్రీలంకతో మూడు టీ20ల సిరీస్ కోసం బీసీసీఐ సోమవారం ప్రకటించిన జట్టులో వాషింగ్టన్ సుందర్కు చోటు దక్కిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో సుందర్ మీడియాతో మాట్లాడాడు. 'భారత జట్టు తరఫున ఆడాలన్న నా కల నిజమైంది. నా తండ్రి, కోచ్ నన్ను క్రికెటర్గా రాణించడంలో కీలకపాత్ర పోషించారు. గత కొద్ది నెలల క్రితం నిర్వహించిన యో-యో టెస్టులో నేను ఫెయిలయ్యాను. ఆ తర్వాత చాలా కష్టపడ్డాను. తాజాగా మరోసారి నిర్వహించగా విజయం సాధించాను' అని సుందర్ తెలిపాడు.
'దీంతో నాకు భారత జట్టులో ఆడే అవకాశం అతి త్వరలోనే వస్తుందని భావించా. అనుకున్నట్లే జరిగింది. ఐపీఎల్ ద్వారా టాప్ బ్యాట్స్మెన్లకు బంతులేసే అవకాశం దక్కింది. నెట్ సెషన్స్లో స్మిత్, ధోనీ, స్టోక్స్లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్లకు బౌలింగ్ వేసిన అనుభవం నాకు కలిసొచ్చింది' అని సుందర్ అన్నాడు.
తన కుమారుడు జాతీయ జట్టులో చోటు దక్కించుకోవడంపై సుందర్ తండ్రి సంతోషం వ్యక్తం చేశాడు. 'నా కుమారుడు భారత జట్టులో స్థానం దక్కించుకోవడం పట్ల తండ్రిగా ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి క్రికెటర్ ఇదే కోరుకుంటారు. 18 ఏళ్ల వయసులోనే సుందర్ తన కలను నిజం చేసుకోవడంతో నా ఆనందానికి అవధుల్లేవు' అని అన్నాడు.
'గతేడాది బంగ్లాదేశ్లో అండర్-19 ప్రపంచకప్లో సుందర్ ప్రదర్శన చూసి సెలక్టర్లు లేఖ రాశారు. ముఖ్యంగా వెస్టిండీస్తో జరిగిన ఫైనల్లో సుందర్ అద్భుతంగా బైలింగ్ చేశాడని కొనియాడారు. ఆ మ్యాచ్లో 9 ఓవర్లు వేసిన సుందర్ 18 పరుగులు మాత్రమే ఇచ్చాడు. అటు బ్యాటింగ్లోనూ రాణించాడు' అని ఆయన తెలిపారు.
ఎడమ చేత్తో బ్యాటింగ్ చేయడం... కుడి చేత్తో బౌలింగ్ చేయడం సుందర్ ప్రత్యేకత. ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రవిచంద్రన్ అశ్విన్ గాయం కారణంగా తప్పుకోవడంతో అతడి స్ధానంలో సుందర్ రైజింగ్ పూణె సూపర్జెయింట్ తరఫున బరిలోకి దిగిన సంగతి తెలిసిందే.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.