30 బంతుల్లో గేల్:
సునామీ ఇన్నింగ్స్లకు పెట్టింది పేరు క్రిస్ గేల్. యూనివర్స్ బాస్ క్రీజులోకి వచ్చాడంటే.. బౌండరీల మోత మోగాల్సిందే, స్కోర్ బోర్డు పరుగులు పెట్టాల్సిందే. ఇక టీ20 అంటే మరింత రెచ్చిపోతాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్లో అత్యంత వేగవంతమైన సెంచరీ నమోదు చేశాడు. 2013లో పుణె వారియర్స్తో జరిగిన మ్యాచ్లో గేల్ కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేసాడు. ఇక 66 బంతుల్లో 175 పరుగులతో రికార్డు సృష్టించాడు. ఐపీఎల్తో పాటు టీ20 క్రికెట్లో ఇప్పటివరకు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోర్. గేల్ ఇన్నింగ్స్లో 13 ఫోర్లు, 17 సిక్సర్లు ఉన్నాయి. ఇతడి ధాటికి బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 263 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇది కూడా ఐపీఎల్లో ఓ జట్టు అత్యధిక స్కోరుగా నిలిచింది.
37 బంతుల్లో యూసఫ్:
రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు యూసఫ్ పఠాన్ 2010 ఐపీఎల్లో విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ 213 పరుగుల భారీ లక్ష్యాన్ని రాజస్థాన్ ముందు ఉంచింది. అప్పటికి పేలవ ఫామ్ కారణంగా విమర్శలు ఎదుర్కొంటున్న యూసఫ్.. తానేంటో నిరూపించుకున్నాడు. 37 బంతుల్లోనే సెంచరీ చేశాడు. ఈ మ్యాచ్లో 8 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. అయితే దురదృష్టవశాత్తు యూసఫ్ రనౌట్గా వెనుదిరగగా.. రాజస్థాన్ ఫలితం తారుమారైంది. మూడేళ్ల తర్వాత యూసఫ్ రికార్డును గేల్ బ్రేక్ చేశాడు.
38 బంతుల్లో మిల్లర్:
2013లో క్రిస్ గేల్ సునామీ సెంచరీ చేసిన కొన్ని రోజులకే దక్షిణాఫ్రికాకు చెందిన డేవిడ్ మిల్లర్ ఐపీఎల్లో మరో వేగవంతమైన సెంచరీ బాదాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో 140 పరుగులు కావాల్సిన తరుణంలో క్రీజులోకి వచ్చిన మిల్లర్.. అద్భుత సెంచరీతో పంజాబ్ కింగ్స్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. 14వ ఓవర్లో 38 బంతుల్లో సెంచరీని సాధించిన మిల్లర్.. మరో రెండు ఓవర్లు మిగిలుండగానే జట్టుకు విజయాన్నందించాడు. కేవలం 54 నిమిషాల్లో మ్యాచ్ గమనాన్నే మార్చేశాడు. 8 ఫోర్లు, 7 సిక్సులతో అతడు చెలరేగిపోయాడు. మూడు పరుగులు చేస్తే జట్టు గెలుపు అనగా.. 95 పరుగుల వద్ద ఉన్న మిల్లర్ సిక్స్తో సెంచరీతో పాటు జట్టుకు విజయాన్ని చేకూర్చాడు.
42 బంతుల్లో గిల్ క్రిస్ట్:
ఆస్ట్రేలియాకు మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్ క్రిస్ట్ 42 బంతుల్లో సెంచరీని సాధించాడు. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్పై డెక్కన్ ఛార్జర్స్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో 154 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన డెక్కన్ ఛార్జర్స్.. 12వ ఓవర్లోనే విజయం సాధించింది. వీవీఎస్ లక్ష్మణ్తో కలిసి గిల్ క్రిస్ట్ 10 సిక్సులు, 9 ఫోర్ల సాయంతో సెంచరీని సాధించాడు. మొత్తంగా 47 బంతుల్లో 109 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. ఇప్పటికి 13 ఎడిషన్లు పూర్తయినా.. గిల్లీ శతకం నాలుగో స్థానంలో నిలవడం విశేషం.
43 బంతుల్లో డివిలియర్స్, వార్నర్:
ఏబీ డివిలియర్స్, డేవిడ్ వార్నర్ ఇద్దరూ 43 బంతుల్లో సెంచరీలు బాదారు. 2016లో గుజరాత్ లయన్స్పై ఏబీ 43 బంతుల్లో సెంచరీ బాదాడు. 12 సిక్సులు, 10 ఫోర్ల సాయంతో సెంచరీ సాధించాడు. ఏబీ విధ్వంసం కారణంగా బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. ఇక హైదరాబాద్ రాజీవ్గాంధీ స్టేడియంలో కోల్కతా నైటరైడర్స్పై వార్నర్ 43 బంతుల్లో సెంచరీ చేశాడు. 11వ ఓవర్లోనే వార్నర్ 8 సిక్సులు, 10 బౌండరీలతో సెంచరీ బాదాడు. ఈ మ్యాచ్లో మొత్తం 50 బంతుల్లో 126 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు.ఆ తర్వాతి స్థానాల్లో సనత్ జయసూర్య (2008లో చెన్నైపై 45 బంతుల్లో), మయాంక్ అగర్వాల్ (2020లో రాజస్థాన్పై 45 బంతుల్లో)లు ఉన్నారు.