బంగ్లాదేశ్ తో మూడు వన్డేల సిరీస్ కు టీమిండియా రెడీ అయింది. ఈ క్రమంలో తొలి మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లా టీమ్ బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ లో భారత జట్టు రెండు కీలక నిర్ణయాలు తీసుకుంది. గాయంతో సిరీస్ కు రిషభ్ పంత్ దూరమైనా.. అతని స్థానంలో కొత్త వికెట్ కీపర్ ను తీసుకోలేదు. వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఈ బాధ్యతలు నిర్వర్తిస్తున్నట్లు ప్రకటించింది.
అలాగే సీనియర్ పేసర్ మహమ్మద్ షమీ కూడా భుజం గాయం కారణంగా ఈ సీరీస్ కు దూరమైన సంగతి తెలిసిందే. అతని స్థానంలో ఎంపికైన ఉమ్రాన్ మాలిక్ కు తొలి వన్డేలో చోటు దక్కలేదు. ఆ స్థానంలో మధ్యప్రదేశ్ ఫాస్ట్ బౌలర్ కుల్దీప్ సేన్ అరంగేట్రం చేశాడు. అతనికి ఈ అవకాశం ఇవ్వడాన్ని క్రికెట్ ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు.
ఇటీవల ముగిసిన విజయ్ హజారే ట్రోఫీలో కుల్దీప్ సేన్ అద్భుతంగా రాణించాడు. 50 ఓవర్ల ఫార్మాట్ లో జరిగిన ఈ దేశవాళీ టోర్నీలో కేవలం ఆరు మ్యాచ్ లు ఆడిన కుల్దీప్.. మొత్తం 18 వికెట్లు తీసుకున్నాడు. మధ్యప్రదేశ్ తరఫున అత్యధిక వికెట్లు తీసుకున్న బౌలర్ గా నిలిచాడు. అద్భుతమైన బౌలింగ్ తో ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పట్టించాడు.
అతని సత్తాను గుర్తించిన టీమిండియా.. బంగ్లాదేశ్ పర్యటనకు కుల్దీప్ ను ఎంపిక చేసింది. అయితే అతనికి ఆదే అవకాశం దక్కుతుందా? అని ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేశారు. అవన్నీ వట్టి అనుమానాలే అని నిరూపించిన టీమ్ మేనేజిమెంట్.. కుల్దీప్ కు డెబ్యూ క్యాప్ అందించింది. బంగ్లాదేశ్ తో తొలి వన్డేలో కుల్దీప్ అరంగేట్రం చేయడాన్ని క్రికెట్ ఫ్యాన్స్ కొనియాడారు.
కుల్దీప్ నిజంగా అర్హుడని, దేశవాళీల్లో సూపర్ గా రాణించాడని మెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో నెట్టింట కుల్దీప్ పేరు వైరల్ అవుతోంది. కుల్దీప్ తో పాటు ఉమ్రాన్ మాలిక్ ను కూడా ఆడించి ఉండాల్సింది అంటున్నారు.