పుణె: అనుభవజ్ఞులు ఉన్న జట్టే అత్యుత్తమ టెస్టు జట్టు. సీనియర్ల లోటును రాత్రికి రాత్రే యువ ఆటగాళ్లతో భర్తీచేయలేం. అనుభవలేమి జట్టుతో బరిలోకి దిగడమే ఓటమికి ప్రధాన కారణం అని దక్షిణాఫ్రికా కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. మ్యాచ్ అనంతరం డుప్లెసిస్ మాట్లాడుతూ పైవిధంగా అన్నాడు. రెండో టెస్ట్లో ఇన్నింగ్స్ 137 పరుగులతో దక్షిణాఫ్రికా ఘోర పరాజయంను చవిచూసింది. ఈ ఓటమితో మూడు టెస్ట్ల సిరీస్లో 2-0తో ఇప్పటికే కోల్పోయింది.
IND vs SA: రిలాక్స్ అయ్యే ప్రసక్తే లేదు.. సిరీస్ క్లీన్స్వీప్ చేయడమే మా లక్ష్యం: కోహ్లీ
'ఉపఖండంలో మొదటి ఇన్నింగ్స్ చాలా ముఖ్యం. మొదటి ఇన్నింగ్స్లో చేసిన పరుగులే మ్యాచును శాసిస్తుంది. టీమిండియా బ్యాటింగ్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ఆ ఇన్నింగ్స్ ఆటను మలుపు తిప్పింది. ఈ పిచ్పై అదనపు సీమర్ను ఎంచుకోవడం సరైన నిర్ణయం అని నేను అనుకున్నా. కాగిసో కొంత ఒత్తిడిని పెంచగలిగాడు. కానీ అతడికి సహకారం అందించే మరో బౌలర్ మాకు అవసరం. భారత బౌలర్లు బాగా బౌలింగ్ చేశారు. యువ ఫాస్ట్ బౌలర్ నోర్జేకు మంచి అవకాశం. ఎన్గిడి ఫిట్నెస్ కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాడు' అని డుప్లెసిస్ తెలిపాడు.
'అనుభవం లేకపోవడమే జట్టు ఓటమికి ప్రధాన కారణమని నేను భావిస్తున్నా. అనుభవజ్ఞులు ఉన్న జట్టే అత్యుత్తమ టెస్టు జట్టు. భారత జట్టులో అనుభవజ్ఞులకు చాలా మంది ఉన్నారు. వారి డ్రెస్సింగ్ రూంలో ఎన్నో మ్యాచ్లాడిన సీనియర్లు ఉన్నారు. డేల్ స్టెయిన్, మోర్కెల్, హషీమ్ ఆమ్లా, ఏబీ డివిలియర్స్ వంటి గొప్ప ఆటగాళ్ల సేవలను మేము కోల్పోయాం. వారి స్థానాలను రాత్రికి రాత్రే యువ ఆటగాళ్లతో భర్తీచేయలేం. మా జట్టులో 5 నుంచి 15 టెస్టులు ఆడిన అనుభవమున్న ఆటగాళ్లు మత్రమే ఉన్నారు' అని డుప్లెసిస్ పేర్కొన్నాడు.
'సీనియర్ ఆటగాళ్లు లేకపోవడంతో భారమంతా నాతో పాటు ఎల్గర్, డికాక్పై పడింది. యువ ఆటగాళ్లకు ఇదో మంచి అవకాశం. కుదురుకోవడానికి కొద్ది సమయం పడుతుంది. పటిష్ట జట్టును తయారుచేసుకోవాలి. తొలి ఇన్నింగ్స్లో పరుగులు చేయలేకపోవడం మా ఓటమికి మరో కారణం. ప్రతి ఇన్నింగ్స్లోనూ 50 పరుగులలోపే కీలక వికెట్లు కోల్పోతున్నాం. ఫామ్లో లేకుండా భారత్లో ఆడటం ఎంతో కష్టం. ఉపఖండంలో ఓపిక అవసరం. మూడో టెస్టులో రాణిస్తాం' అని డుప్లెసిస్ ధీమా వ్యక్తం చేసాడు.