హైదరాబాద్: పాకిస్ధాన్లో ప్రపంచ దేశాలు క్రికెట్ ఆడేందుకు గాను తొలి అడుగు పడింది. పాకిస్థాన్ జట్టుతో మూడు టీ20ల సిరిస్ ఆడేందుకు గాను వరల్డ్ ఎలెవన్ క్రికెట్ జట్టు పాకిస్థాన్కు చేరుకుంది. కెప్టెన్ డుప్లెసిస్ నేతృత్వంలోని 13 మంది సభ్యుల బృందం సోమవారం తెల్లవారుజామున లాహోర్లోని ఆల్మా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధికారులు వీరికి ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక బస్సుల్లో భారీ భద్రత నడుమ లాహార్ మెయిన్ మాల్ రోడ్డులోని ఫైవ్ స్టార్ హోటల్కు ఆటగాళ్లు చేరుకున్నారు. మార్చి, 2009 తర్వాత అంతర్జాతీయ జట్టు ఆటగాళ్లు పాక్లో ఆడేందుకు రావడం ఇదే తొలిసారి.
2009లో శ్రీలంక క్రికెట్ జట్టు ప్రయాణిస్తున్న బస్సుపై ఉగ్రవాదుల దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఉగ్రదాడిలో ఎనిమిది మంది స్థానికులు చనిపోగా శ్రీలంక జట్టుకు చెందిన ఏడుగురు ఆటగాళ్లు గాయపడ్డారు. అప్పటి నుంచి భద్రతా కారణాల దృష్ట్యా పాక్లో ఆడేందుకు టెస్టు హోదా కలిగిన టాప్ జట్లు ఏవీ సాహసించలేదు.

అయితే 2015లో ఇదే లాహోర్ వేదికగా జింబాబ్వే జట్టు పరిమిత ఓవర్ల సిరిస్ ఆడేందుకు పాకిస్థాన్కు వచ్చింది. ఈ సిరిస్కి సంబంధించి మ్యాచ్ రిఫరీలను, అంఫైర్లను పంపించేందుకు ఐసీసీ కూడా నిరాకరించింది. మళ్లీ ఇన్నాళ్లకు ఇండిపెండెన్స్ కప్లో భాగంగా వరల్డ్ ఎలెవన్ జట్టు పాక్లో ఆడేందుకు అంగీకరించింది.
ఈ టోర్నీలో భాగంగా లాహార్లోని గడాఫీ స్టేడియంలో సెప్టెంబర్ 12, 13, 15 తేదీల్లో మూడు టీ20 మ్యాచ్లను నిర్వహించనున్నారు. ఈ టోర్నీతో రాబోయే రోజుల్లో పాకిస్థాన్లో మిగతా దేశాలు కూడా ఆడేందుకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తవన్న సంకేతాలను పంపించాలనే ఉద్దేశంతో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు టోర్నీని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఈ మ్యాచ్ల భద్రతకు సుమారు తొమ్మిది వేల మంది భద్రతా సిబ్బందిని వినియోగిస్తున్నారు. ఈ టోర్నీలో భాగంగా దక్షిణాఫ్రికా నుంచి డుప్లెసిస్తో పాటు ఆమ్లా, మోర్కెల్, మిల్లర్, తాహిర్, ఆస్ట్రేలియా నుంచి బెయిలీ, బెన్ కట్టింగ్, టిమ్ పేన్, విండీస్ నుంచి ఇద్దరు ఆటగాళ్లు ఆడనున్నారు. ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, న్యూజిలాండ్, శ్రీలంక నుంచి ఒక్కో ఆటగాడు పాల్గొననున్నారు.
వరల్డ్ ఎలెవన్ జట్టుకు దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కెప్టెన్ డుప్లిసిస్ కెప్టెన్గా వ్యవహరించనున్నాడు. కాగా, స్వదేశంలో వరల్డ్ ఎలెవన్ టీమ్తో తలపడే 16 మంది సభ్యుల జట్టును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఇప్పటికే ప్రకటించింది. ఈ జట్టుకు పాకిస్థాన్ రెగ్యులర్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ కెప్టెన్గా బాధ్యతలను నిర్వర్తించనున్నాడు.
వరల్డ్ ఎలెవన్ జట్టు:
Faf du Plessis (Captain), Hashim Amla, Colin Miller, Imran Tahir, Morne Morkel (SA), George Bailey, Tim Paine, Benn Cutting (Aus), Tamim Iqbal (Bangladesh), Thissara Perreira (Sri Lanka), Grant Elliot (NZ), Paul Collingwood (Eng) Darren Sammy and Samuel Badree (West Indies).