హైదరాబాద్: రెండు టెస్టులు, ఐదు వన్డేలు, ఒక టీ20 కోసం త్వరలో డుప్లెసిస్ సారథ్యంలోని సఫారీ జట్టు శ్రీలంక పర్యటనకు బయల్దేరనుంది. లంక పిచ్లు స్పిన్కు అనుకూలం. కరేబియన్ గడ్డపై వెస్టిండిస్తో జరిగిన రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో లంక కెప్టెన్ దినేశ్ చండీమాల్ బాల్ టాంపరింగ్కు పాల్పడి ఒక టెస్టు మ్యాచ్ నిషేధానికి గురయ్యాడు.
ఈ నేపథ్యంలో శ్రీలంక పర్యటనపై దక్షిణాఫ్రికా కెప్టెన్ డుప్లెసిస్ మాట్లాడాడు. ఇకపై బాల్ ట్యాంపరింగ్కు పాల్పడే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని డుప్లెసిస్ పేర్కొన్నాడు. బాల్ టాంపరింగ్కు పాల్పడే వారికి ప్రస్తుతం అవలంభిస్తున్న నిబంధనల్ని మరింత కఠినతరం చేయాలని అన్నాడు.
"బాల్ టాంపరింగ్కు పాల్పడే వారి పట్ల మరింత కఠినంగా వ్యవహరిస్తే మంచిది. ప్రస్తుతం ఉన్న విధానంతో ఎటువంటి ఉపయోగం కనబడటం లేదు. ఎందుకంటే పదే పదే బాల్ టాంపరింగ్ ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. దీనిపై ఐసీసీ ప్రస్తుతం అనుసరిస్తున్న విధానానికి సవరించాలి. బాల్ ట్యాంపరింగ్కు చెక్ పెట్టాలంటే జరిమానా అనేది ఎక్కువ మొత్తంలో ఉండాల్సిందే" అని అన్నాడు.
"అప్పుడే టాంపరింగ్కు ఫుల్స్టాప్ పడుతుంది. గత కొన్ని సంవత్సరాలుగా పలువురు కెప్టెన్లు ఈ విషయమై మాట్లాడుతూనే ఉన్నారు. కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకువస్తేనే ఈ చర్యలను కొంతవరకైనా అరికట్టొచ్చు. దీనివల్ల అన్ని జట్లలో నిలకడ ఉంటుంది" అని డుప్లెసిస్ తెలిపాడు.
ఇటీవల శ్రీలంక కెప్టెన్ చండిమాల్ బాల్ టాంపరింగ్ వివాదంలో చిక్కుకుని ఒక టెస్టు మ్యాచ్కు దూరమైన సంగతి తెలిసిందే. అయితే, బాల్ టాంపరింగ్కు కారణమైన ప్రతీ ఒక్కరికీ ఒకే నిబంధన ఉండేలా చూడాలని డుప్లెసిస్ సూచించాడు. ఐసీసీ నిబంధనల్లో క్లారిటీతో పాటు నిలకడ ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా డుప్లెసిస్ తెలిపాడు.