ప్రతి ఒక్క ఆటగాడికి ఏదో ప్రణాళిక ఉంటుంది
"పరిస్థితులకు అనుగుణంగా ప్రతి ఒక్క ఆటగాడికి ఏదో ప్రణాళిక ఉంటుంది. ఒకరు దూకుడుగా ఆడాలనుకుంటారు. మరొకరు నిదానంగా.. ఇక మురళీ విజయ్తో పోల్చుకుంటే నా ఆట అందుకు పూర్తి భిన్నంగా ఉంటుంది. క్రీజులో ఉన్నప్పుడు నేను మాత్రం దూకుడుగా ఆడాలనుకుంటాను. ఈ మ్యాచ్లోనూ అదే కొనసాగించా" అని ధావన్ పేర్కొన్నాడు.
ఆప్ఘన్ అరంగేట్ర టెస్టు మ్యాచ్
ఐపీఎల్ ముగిసిన తర్వాత టీమిండియా ఆడుతున్న తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడం, మరోవైపు ఆప్ఘనిస్థాన్ అరంగ్రేట టెస్టు మ్యాచ్ కావడంతో అందరిదృష్టి ఈ టెస్టుపైనే ఉంది. ఈ టెస్టులో భారత బ్యాట్స్మెన్ సెంచరీలతో చెలరేగగా... అభిమానుల అంచనాల మధ్య బరిలోకి దిగిన ఆప్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ నిరాశపరిచిన సంగతి తెలిసిందే.
నిరాశపరిచిన రషీద్ ఖాన్
టీమిండియా తొలి ఇన్నింగ్స్లో ఆప్ఘన్ పేసర్లు చక్కటి బంతులు విసిరి ఆకట్టుకోగా, రషీద్ ఖాన్ మాత్రం తేలిపోయాడు. తొలి ఇన్నింగ్స్లో 34.5 ఓవర్లు వేసిన ఈ అప్ఘాన్ స్పిన్నర్ 154 పరుగులిచ్చి రెండు వికెట్లు మాత్రమే పడగొట్టాడు. ఆప్ఘన్ జట్టు టెస్టుల్లో అరంగేట్రం చేసిన మ్యాచ్లో అత్యధిక పరుగులు ఇచ్చుకున్న బౌలర్గా రషీద్ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.
చెత్త రికార్డు నమోదు చేసిన రషీద్ ఖాన్
గతంలో ఈ రికార్డ్ పాక్ బౌలర్ అమీర్ ఇలాహీ పేరిట ఉండేది. పాకిస్థాన్ 1952లో భారత్పై టెస్టుల్లోకి అరంగేట్రం చేసింది. ఆ మ్యాచ్లో అమీర్ 134 పరుగులు ఇవ్వగా.. రషీద్.. అంత కంటే ఎక్కువ పరుగులిచ్చాడు. ముఖ్యంగా రషీద్ ఖాన్ బౌలింగ్ను ఎలాంటి ఇబ్బందికి గురికాకుండా బౌండరీలు బాదిన ధావన్(107; 96 బంతుల్లో) సెంచరీతో చెలరేగిపోయాడు.