లండన్: ప్రస్తుతానికి నా క్రికెట్ కెరీర్కు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఏదైనా వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్ తర్వాతే నిర్ణయం తీసుకుంటా. ఏమో అప్పుడు క్రికెట్కు గుడ్ బై చెప్పొచ్చేమో? అని ఇంగ్లండ్ పరిమిత ఓవర్ల కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తెలిపారు. గత కొంతకాలంగా క్రికెట్కు గుడ్ బై చెప్పే యోచనలో మోర్గాన్ ఉన్నట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో స్పందించిన మోర్గాన్.. ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 ప్రపంచకప్ తర్వాతే తన కెరీర్పై నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేసాడు.
జిమ్లో బుమ్రా ప్రాక్టీస్ ఫోటో.. టీజ్ చేసిన మహిళా క్రికెటర్!!
'ప్రస్తుతానికి నా క్రికెట్ కెరీర్కు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.ఆ విషయంపై ఇప్పుడేమీ మాట్లాడాను. నేను ఎవరినీ నిరాశపరచకూడదనుకుంటున్నాను. టీ20 ప్రపంచకప్ ముగిసిన తర్వాత గుడ్ బై చెపునానని కూడా కచ్చితంగా చెప్పలేను. ఏ నిర్ణయం అయినా ప్రపంచకప్ తర్వాత తీసుకుంటా' అని మోర్గాన్ తెలిపారు. 'ప్రస్తుతానికి మంచి జట్టు ఉంది. ఆ జట్టుకి నాయకత్వం వహించడం చాలా అదృష్టంగా భావిస్తున్నా. జట్టు కోసం ఇంకా ఏదైనా చేయాలని భావిస్తున్నా' అని అన్నారు.
న్యూజిలాండ్తో జరుగనున్న టీ20 సిరీస్కు ఇంగ్లీష్ స్టార్ ఆటగాళ్లు బెన్ స్టోక్స్, జోఫ్రా ఆర్చర్, జోస్ బట్లర్, జాసన్ రాయ్లకు విశ్రాంతి ఇచ్చారు. దీనిపై మోర్గాన్ స్పందిస్తూ... 'అంతమంది ఆటగాళ్లను పక్కకు పెట్టడం అంత తేలిగ్గా తీసుకున్న నిర్ణయం కాదు. కొత్త వారికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే అలా చేసాం. కీలక ఆటగాళ్లకు విశ్రాంతిని ఇవ్వడంతోనే.. ఐదుగురు అన్క్యాప్డ్ ప్లేయర్స్ను కివీస్తో సిరీస్కు ఎంపిక చేసాం. సాధ్యమైనంతవరకూ పటిష్టంగా ఉన్న జట్టునే ఎంపిక చేసాం. టీ20 ప్రపంచకప్కి పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడమే మా లక్ష్యం' అని పేర్కొన్నారు.
ఇంగ్లండ్ జట్టుకు మోర్గాన్ మొదటి ప్రపంచకప్ అందించాడు. బ్రిటీష్ జట్టు దశాబ్దాల చిరకాల కలను మోర్గాన్ నెరవేర్చాడు. న్యూజిలాండ్-ఇంగ్లండ్ జట్ల మధ్య నువ్వానేనా అన్నట్టు సాగిన ఉత్కంఠ సమరంలో ఇంగ్లండ్ విజేతగా నిలిచింది. తొలుత ఇరు జట్ల స్కోర్లు సమం కావడంతో మ్యాచ్ టైగా ముగిసింది. సూపర్ ఓవర్లో కూడా ఇరు జట్ల స్కోరు సమమైంది. దీంతో మెరుగైన బౌండరీలు సాధించిన ఇంగ్లండ్ను విశ్వవిజేతగా నిర్ణయించారు. ప్రపంచకప్ టోర్నీలో గెలిచిన ఇంగ్లండ్ టీంకి మొత్తం 27.38 కోట్లు దక్కింది .